అనుకున్నది సాధిస్తున్న రాజమౌళి

ఆర్ఆర్ఆర్ ని తెలుగు రాష్ట్రాల జనాలు దాదాపుగా మర్చిపోయినా రాజమౌళి మాత్రం ఇంకొంత కాలం అదే ప్రపంచంగా ఉండబోతున్నారు. జపాన్ లో ఇటీవలే చరణ్ తారక్ లతో చేసిన ప్రమోషన్లు చాలా ప్లస్ అయ్యాయి. కలెక్షన్ల పరంగా మూడో స్థానాన్ని అందుకున్న ట్రిపులార్ త్వరలోనే బాహుబలి 2ని దాటేయబోతోంది. ఒకవేళ ఇదే ఊపుతో లాంగ్ రన్ కొనసాగితే మాత్రం టాప్ వన్ లో కూర్చున్న ముత్తుని ఈజీగా క్రాస్ చేయొచ్చని అక్కడి విశ్లేషకుల అంచనా. ముత్తు 400 మిలియన్ యెన్లు, బాహుబలి టూ 300 మిలియన్ యెన్లతో ఉండగా ఆర్ఆర్ఆర్ కేవలం 17 రోజులకే 185 మిలియన్ యెన్లు అందుకుంది. మన కరెన్సీలో పది కోట్లు.

జక్కన్నకు పలు లక్ష్యాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ కు ఒకటి రెండు విభాగాల్లో ఆస్కార్ వచ్చేలా పోరాడటం. దాని కోసం ఆయన చేతిలో ఉన్న ఆయుధం ప్రమోషన్లు. యుఎస్ లో ఎన్కోర్ పేరుతో వేస్తున్న స్పెషల్ ప్రీమియర్లు ఇన్ని నెలల తర్వాత కూడా అద్భుత స్పందన దక్కించుకుంటున్నాయి. సినిమాకు మద్దతుగా వేలాది అమెరికా పౌరులు, ఇండస్ట్రీ నిపుణులు ట్వీట్లు వేస్తూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ అకాడమీ పరిగణనలోకి తీసుకుంటుందని కాదు కానీ జరుగుతున్న పరిణామాలు దృష్టికి రాకుండా అయితే పోవు. సో ఇది పాజిటివ్ అంశమే.

ఇక రాజమౌళి మరో టార్గెట్ కెజిఎఫ్ 2. ఇప్పటిదాకా 1200 కోట్లతో టాప్ వన్ లో ఉన్న ఆ సినిమాను దాటాలంటే ఇంకొక్క యాభై కోట్లు వస్తే చాలు. జపాన్ తో ఆ లాంఛనం పూర్తవుతుంది. ఆ తర్వాత ఎలాగూ చైనా ఉంది. సో ఎంతలేదన్నా రెండు వేల కోట్లను అందుకోవచ్చనేది జక్కన్న ఆలోచన. ఇదంతా అసాధ్యమైతే కాదు. ఆస్కార్ దక్కించుకుని, కెజిఎఫ్ 2ని దాటేసి, ఇండియా టాప్ వన్ గా ఆర్ఆర్ఆర్ ని నిలబెట్టేస్తే మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్టుకు ఇంటర్నేషనల్ లెవెల్ లో విపరీతమైన హైప్ వచ్చేస్తుంది. అప్పుడు వందలేం ఖర్మ వేల కోట్ల బడ్జెట్ అయినా సరే ధైర్యంగా ఖర్చు పెట్టొచ్చు.