వావ్.. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్

నాయ‌గ‌న్‌.. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగా పేరున్న క్లాసిక్. మ‌ణిర‌త్నం అనే ద‌ర్శ‌కుడి స్థాయి ఏంటో భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తెలియ‌జేసిన సినిమా ఇది. ఇక న‌టుడిగా క‌మ‌ల్ హాస‌న్ కీర్తి కిరీటంలో దీన్నొక క‌లికుతురాయిగా చెప్పొచ్చు. త‌న కెరీర్ ఆరంభంలోనే క‌మ‌ల్ లాంటి దిగ్గ‌జ న‌టుడితో అద్భుత‌మైన సినిమా తీసి గొప్ప ప్ర‌శంస‌లు అందుకున్నాడు మ‌ణిర‌త్నం.

ఐతే ఇలాంటి క్లాసిక్ తీసిన కాంబినేష‌న్ నుంచి మ‌ళ్లీ సినిమానే రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఇక కెరీర్లో ఈ ద‌శ‌లో ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తార‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు. కానీ అంద‌రికీ పెద్ద షాకిస్తూ 35 ఏళ్ల విరామం త‌ర్వాత క‌మ‌ల్, మ‌ణిర‌త్నం క‌లిసి సినిమా చేయ‌బోతున్నారు. దీని గురించి ఆదివార‌మే స‌డ‌న్ స‌ర్ప్రైజ్ లాగా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

విక్ర‌మ్ సినిమాతో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్-2 సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలోనే న‌టించ‌బోతున్నాడు లోక‌నాయ‌కుడు. క‌మ‌ల్ 234వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టును క‌మ‌ల్, మ‌ణిర‌త్నం క‌లిసి నిర్మించ‌బోతుండ‌డం విశేషం.

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, న‌టుడు ఉద‌య‌నిధి స్టాలిన్ సంస్త రెడ్ జెయింట్స్ కూడా ఇందులో నిర్మాణ భాగ‌స్వామి కాబోతోంది. వ‌చ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్ల‌నున్న ఈ చిత్రం 2024లో విడుద‌ల కానుంది. మ‌ణిర‌త్నం ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.రెహ‌మానే ఈ చిత్రానికి మ్యూజిక్ చేయ‌బోతున్నాడు. పొన్నియ‌న్ సెల్వ‌న్ ఆడియో వేడుక‌కు ముఖ్య అతిథుల్లో ఒక‌డిగా హాజ‌రైన క‌మ‌ల్.. మ‌ణిర‌త్నం గురించి గొప్ప‌గా మాట్లాడిన‌పుడే మ‌ళ్లీ ఈ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తారా అన్న చ‌ర్చ న‌డిచింది. ఇప్పుడు ఆ సందేహాలే నిజ‌మ‌య్యాయి. మ‌రి నాయ‌క‌న్ జోడీ ఈసారి ఎలాంటి చిత్రాన్ని అందిస్తుందో?