ప్రభాస్.. ఉన్నవి సరిపోవా?

‘బాహుబలి’ తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ ప్రభాస్ జోరేమీ తగ్గలేదు. వరుసగా భారీ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఆదిపురుష్ చిత్రాన్ని గత ఏడాదే పూర్తి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’తో పాటు ‘ప్రాజెక్ట్-కే’, మారుతి సినిమాల్లో సమాంతరంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంత పెద్ద హీరో ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కాగా ప్రభాస్ నాలుగో సినిమా సైతం ఎప్పుడో ఖరారైంది.

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే సినిమాను గత ఏడాదే అనౌన్స్ చేశారు. కానీ అది 2024లో కానీ సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. చేతిలో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. మధ్యలోకి మారుతి సినిమాను తీసుకురావడమే వారికి నచ్చలేదు.

అలాంటిది ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఇంకో సినిమా అంటూ చర్చ మొదలైంది. ఐతే ఈ చర్చ కొత్తదేమీ కాదు. గతంలోనే దీని గురించి చర్చ జరిగింది. బాలీవుడ్లో యాక్షన్ సినిమాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా కమిటైనట్లుగా మళ్లీ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ సినిమా తీస్తున్న సిద్దార్థ్‌కు బాలీవుడ్లో మంచి డిమాండే ఉంది. ‘వార్’తో అతను మెగా హిట్ ఇచ్చాడు. ‘పఠాన్’ సైతం అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

సిద్దార్థ్‌తో ప్రభాస్ సినిమా చేస్తే బాగానే ఉంటుంది కానీ.. అసలు ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటినీ పూర్తి చేసి ఎప్పటికి ఫ్రీ అవుతాడన్నది చూడాలి. చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేయకుండా కొత్తగా ఒక్కొక్కటి కమిటవుతూ వెళ్లడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఐతే ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు ఈ సినిమాకు గాను సిద్దార్థ్ రూ.80 కోట్ల పారితోసకం పుచ్చుకోబోతున్నట్లు అప్పుడే ప్రచారం జరిగిపోతుండడమే విడ్డూరం.