నో రీమేక్స్ అంటున్న దర్శకుడు

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో రీమేక్స్ హవా నడుస్తుంది. ఒక భాషలో సినిమా హిట్టయితే చాలు వెంటనే దాని రైట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. తెలుగులో కూడా రీమేక్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. వారానికి మూడు , నాలుగు సినిమాలు రిలీజవుతుంటే అందులో ఒకటైనా రీమేక్ ఉండనే ఉంటుంది. అయితే కుర్ర దర్శకుడు మేర్లపాక గాంధి మాత్రం ఇకపై నో రీమేక్ అంటూ ఓ స్టేట్ మెంట్ పాస్ చేశాడు.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో దర్శకుడిగా పరిచయమైన గాంధీ ఆ వెంటనే ఎక్స్ ప్రెస్ రాజా అనే సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ మాత్రం మేర్లపాక సక్సెస్ కి బ్రేక్ వేసింది. మొదటి ఫెయిల్యుయర్ నుండి బయట పడి ఇంకో సినిమా చేయడానికి చాలా టైం తీసుకునన్ గాంధీ నితిన్ తో ‘మాస్ట్రో’ అనే రీమేక్ సినిమా చేశాడు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న ‘అంధదూన్’ సినిమాను ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోయడనే కామెంట్ అందుకున్నాడు. దీంతో డైరెక్ట్ ఓటీటీ లో రిలీజైన మాస్ట్రో కూడా యంగ్ డైరెక్టర్ కి సక్సెస్ ఇవ్వలేకపోయింది.

తాజాగా ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ స్పందించాడు మేర్లపాక. ఇకపై రీమేక్ చేయనని స్ట్రైట్ సినిమాలే తీస్తానని చెప్పుకున్నాడు. మాస్ట్రో తర్వాత కూడా ఓ పెద్ద సంస్థ నుండి రీమేక్ సినిమా ఆఫర్ వచ్చిందని కానీ తనే వదులుకున్నానని తెలిపాడు. రీమేక్ సినిమా అంటే యాక్టర్ కి కూడా ఆసక్తి ఉండదని, ముఖ్యంగా ఎగ్జైట్ మెంట్ కలగదని అన్నాడు. అందుకే ఇకపై రీమేక్ సినిమా చేయకూడదనే డిసిషన్ తీసుకున్నానని తెలిపాడు. మాస్ట్రో విషయంలో నితిన్ అతని తండ్రి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారనే టాక్ వినిపించింది. ఇప్పుడు మేర్లపాక గాంధి రీమేక్స్ పై కామెంట్ చేయడానికి అది కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చు.