అవతార్-2తో కలిసి రానున్న పుష్ప

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ కావాలంటే రాజమౌళితోనే సినిమా చేయాల్సిన అవసరం లేదని చాటి చెప్పాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ మూవీతో అతను అనూహ్యంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా తెలుగేతర భాషల్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్నందుకుంది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా ఏకంగా వంద కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టి అక్కడి ట్రేడ్ పండిట్లను షాక్‌కు గురి చేసింది.

ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్ వరల్డ్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. మెడ కింద చెయ్యి పెట్టి తగ్గేదేలే అంటూ చెప్పే డైలాగ్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఈ పాపులారిటీ ‘పుష్ప-2’ బిజినెస్‌కు బాగా కలిసొస్తోంది. ఈ సినిమాకు ఉన్న హైప్‌ను ఇంకా పెంచేందుకు ముందు నుంచి మార్కెటింగ్ గట్టిగా చేయడానికి రెడీ అవుతోంది చిత్ర బృందం. ఒక బ్యాంగ్ బ్యాంగ్ వీడియో ప్రోమోతో ‘పుష్ప-2’ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట సుకుమార్.

నేరుగా ‘పుష్ప-2’ టాకీ పార్ట్ చిత్రీకరణ మొదలుపెట్టకుండా.. టీజర్ గ్లింప్స్ కోసం విజువల్స్ తీయబోతున్నాడట సుకుమార్. ఇంకొన్ని రోజుల్లోనే రామోజీ ఫిలిం సిటీలో ఈ షూట్ జరగబోతోంది. కొన్ని రోజుల పాటు ఈ షాట్స్ చిత్రీకరించి.. దాన్ని ఎడిటింగ్‌కు పంపించి ఆ తర్వాత రెగ్యులర్ షూట్‌లోకి వెళ్లనున్నారట.

‘పుష్ప-2’ టీజర్ గ్లింప్స్‌ను ‘అవతార్-2’ రిలీజ్ రోజు వరల్డ్ వైడ్ వీలైనంత మేర ఆ సినిమా ఆడే థియేటర్లలో ఇంటర్వెల్‌లో ప్రదర్శించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 25 భాషల్లో ఈ టీజర్ గ్లింప్స్ లాంచ్ చేయబోతున్నారట. ‘పుష్ప-2’ సినిమాకు ఇది బ్యాంగ్ బ్యాంగ్ స్టార్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఒకేసారి సినిమా మీద హైప్ మరిన్ని రెట్లు పెరిగేలా సుకుమార్ ఈ టీజర్ గ్లింప్స్‌ను తీర్చిదిద్దడంతో పాటు దీని రీచ్ ఒక రేంజిలో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకు రిలీజయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.