ర‌జినీకాంత్.. ఇంకో రెండు సినిమాలు

గ‌త త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కొత్త పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి దిగాల‌ని అనుకున్నాడు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్. అప్ప‌టికే ఆయ‌న 70వ ప‌డికి చేరువ అయ్యారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి దిగాడంటే ఇక సినిమాల గురించి అంద‌రూ మ‌రిచిపోవాల్సిందే అనుకున్నారు. 2.0నే ఆయ‌న చివ‌రి చిత్రం అవుతుంద‌ని కూడా అంచ‌నా వేశారు. కానీ త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి.

పార్టీ పెట్టే విష‌యంలో ర‌జినీ త్వ‌ర‌గా ఓ నిర్ణ‌యం తీసుకోలేక‌పోయారు. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారి, క‌రోనా కార‌ణంగా ఆరోగ్యం విష‌యంలో ఆందోళ‌న త‌లెత్తి పూర్తిగా పార్టీ పెట్టే ఆలోచ‌న‌నే విర‌మించుకున్నారు. ఎప్ప‌ట్లాగే సినిమాలు చేసుకుంటూ సాగిపోయారు. ఈ క్ర‌మంలోనే పేట‌, ద‌ర్బార్, అన్నాత్తె.. ఇలా వ‌రుస‌గా సినిమాలు చేశాడు సూప‌ర్ స్టార్. 71 ఏళ్ల వ‌య‌సులోనూ ఇటీవ‌లే జైల‌ర్ అనే సినిమాను మొద‌లుపెట్టారు. ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇప్పుడు ర‌జినీ కొత్త‌గా రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం విశేషం. అది కూడా ఒకే నిర్మాత‌కు కావ‌డం గ‌మ‌నార్హం. ర‌జినీతో 2.0 లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్‌తో ర‌జినీ రెండు కొత్త సినిమాల‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విష‌యాన్ని లైకా వాళ్లే శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇందులో ఒక సినిమాకు న‌వంబ‌రు 4న మూహూర్త వేడుక జ‌ర‌ప‌నున్నారు. మ‌రి ఈ రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌కులు ఎవ‌రు అనే విష‌యంలో స‌స్పెన్స్ న‌డుస్తోంది.

ఒక సినిమాను ర‌జినీతో పేట తీసిన కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట్ చేయొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌జినీతో సినిమా చేయాల‌ని క‌ల‌గనే ద‌ర్శ‌కులు కోలీవుడ్లో చాలామందే ఉన్నారు. బింబిసార‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ్ సైతం ర‌జినీకి ఒక క‌థ చెప్పిన‌ట్లు వార్త‌లొచ్చాయి. మ‌రి అత‌డికి ఈ రెండు చిత్రాల్లో ఒక‌దాంట్లో ఏమైనా అవ‌కాశం ద‌క్కుతుందేమో చూడాలి.