ఒకే వేదికపై రజనీ తారక్

కొన్ని అరుదైన కలయికలు పదే పదే జరగవు. దానికి సమయం సందర్భం కలిసి రావాలి. అలాంటి అరుదైన కాంబోకు బెంగళూరు వేదిక కానుంది. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ కు త్వరలో కర్ణాటకరత్న బిరుదును ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు తమ అంగీకారాన్ని తెలిపారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్వయంగా ఈ విషయం వెల్లడించడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. నవంబర్ 1న జరగబోయే స్టేట్ ఫార్మేషన్ డే నాడు ఘనమైన నివాళితో ఈ పురస్కారం అందజేస్తారు.

తారక్ తో పునీత్ కు ఎప్పటినుంచో బాండింగ్ ఉంది. అతని చక్రవ్యూహ సినిమా కోసం జూనియర్ ప్రత్యేకంగా కన్నడలో పాట పాడటం అప్పట్లో సంచలనం. తమన్ స్వరపరిచిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. పరస్పరం ఇద్దరూ ఎక్కడ కలుసుకున్నా వాళ్ళ బాండింగ్ చాలాసార్లు బయట పడింది. ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కన్నడనాడే కావడం ఇది మరింత బలపడేందుకు దోహదపడింది. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేసుకున్నారు కానీ అది సాధ్యపడలేదు. ఈలోగా విధి వక్రీకరించి పునీత్ శాశ్వతంగా సెలవు తీసుకోవడం జరిగిపోయింది.

ఇక రజనీకాంత్ కు రాజ్ కుమార్ కుటుంబంతో అనుబంధం ఇప్పటిది కాదు. దశాబ్దాల నాటిది.ప్రస్తుతం సూపర్ స్టార్ జైలర్ లో పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇలా పలురకాలుగా ఎమోషనల్ అటాచ్ మెంట్ కొనసాగుతూనే ఉంది. వీళ్ళే కాదు ఎందరో అతిరథ మహారథులు కర్ణాటక రత్న ఫంక్షన్ కు హాజరు కాబోతున్నారు. ఏది ఏమైనా దగ్గరి వాళ్ళు చనిపోతేనే సాయంత్రానికి మర్చిపోతున్న కాలంలో ఏడాది కావొస్తున్నా ఆ మనిషి జ్ఞాపకాల్లోనే ఉంటూ శాండల్ వుడ్ ఫ్యాన్స్ ఇంకా ఇంత ప్రేమను ప్రదర్శించడం చూస్తే పునీత్ నిజంగా కారణజన్ముడే అనిపిస్తుంది.