దృశ్యం-2.. వెంకీ ఏం చేయబోతున్నాడు?

తెలుగులో రీమేక్‌లకు బాగా పేరుపడ్డ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అగ్ర హీరోల్లో అత్యధికంగా రీమేక్‌ల్లో నటించిన కథానాయకుడు ఆయనే కావచ్చు. రీమేక్‌లతో రాజా, సూర్యవంశం, సంక్రాంతి, దృశ్యం, గురు లాంటి మంచి విజయాలందుకున్నాడు వెంకీ. ఐతే ఇంతకుముందుతో పోలిస్తే ఈ మధ్య రీమేక్‌లు చేయడం తగ్గింది.
ఐతే ఆయన ఇప్పుడు మళ్లీ ఓ రీమేక్‌ మీద దృష్టిసారించినట్లు వార్తలొస్తున్నాయి. అదే.. దృశ్యం-2. మలయాళంలో కొన్నేళ్ల కిందట విడుదలై, అక్కడ తొలిసారి 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి చరిత్ర సినిమాగా నిలిచిన ‘దృశ్యం’ను తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్, తెలుగులో వెంకీ హీరోలుగా రీమేక్ చేయగా.. అన్ని చోట్లా మంచి విజయమే అందుకుంది. ఫ్లాపుల్లో ఉన్న వెంకీకి ఈ సినిమానే ఉపశమనాన్ని అందించింది.

ఐతే ఇప్పుడు ‘దృశ్యం’కు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు ఈ మధ్యే అధికారిక ప్రకటన వచ్చింది. హీరోగా మోహన్ లాలే నటించనుండగా.. ఒరిజినల్ తీసిన జీతు జోసెఫే దీన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ప్రాపర్ సీక్వెల్ అని.. తొలి చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే కథ మొదలవుతుందని.. ముగిసిందనుకున్ను కేసును మళ్లీ ఓ పోలీస్ అధికారి తిరగదోడడంతో హీరో చిక్కుల్లో పడే నేపథ్యంలో కథ నడుస్తుందని దర్శకుడు జీతు సంకేతాలు ఇచ్చాడు.

మరి మలయాళంలో ‘దృశ్యం-2’ తెరకెక్కుతోందనగానే.. ఇతర భాషల్లో దీని రీమేక్‌ల గురించి కూడా చర్చ మొదలైపోయింది. తెలుగులో వెంకీ ఈ సినిమా చేస్తాడా అన్న ప్రశ్న తలెత్తింది. ఐతే వెంకీ ఈ విషయంలో ఆసక్తిగానే ఉన్నాడని.. కానీ ఇప్పుడే దానిపై ఏ నిర్ణయం తీసుకోలేదని, ‘దృశ్యం-2’ పూర్తయి విడుదలయ్యాక దాని ఫలితాన్ని చూసి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని.. చిత్ర బృందానికి రీమేక్ విషయంలో ఇప్పుడే ఓ మాట చెప్పి ఉంచుతున్నారని.. సినిమా హిట్టయితే సురేష్ ప్రొడక్షన్స్‌ వాళ్లే రీమేక్ హక్కులు తీసుకుని వెంకీతో తెరకెక్కిస్తారని సమాచారం.