ఇక్కడైనా ఆహా అనిపిస్తుందా?

ఈసారి దసరా పండక్కి మూడు సినిమాలు రిలీజైతే.. అందులో కంటెంట్ పరంగా కొత్తగా అనిపించి, మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నది స్వాతిముత్యం సినిమానే. నాగార్జున సినిమా ది ఘోస్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకుని బోల్తా కొట్టగా.. చిరు సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే తొలి వీకెండ్ వరకు మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఐతే స్వాతిముత్యం సినిమా మాత్రం టాక్‌తో తగ్గట్లుగా బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేయలేకపోయింది.

కొత్త హీరో, పేరు లేని హీరోయిన్ కాబట్టి విడుదల ముంగిట, రిలీజ్ రోజు సందడి లేదు అనుకోవచ్చు. కానీ మంచి టాక్ వచ్చింది, రివ్యూలు బాగున్నాయి. అందులోనూ దసరా సెలవులున్నాయి. అలాంటపుడు సినిమా కచ్చితంగా పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నామమాత్రపు వసూళ్లతో సాగిన ఈ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఐతే ఇలా మంచి టాక్ తెచ్చుకుని కూడా థియేటర్లలో సరిగా ఆడని రాజావారు రాణివారు, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి చిత్రాలు ఓటీటీల్లో చాలా మంచి స్పందన తెచ్చుకున్నాయి. చాలామంది ఆ సినిమాలు చూసి థియేటర్లలో ఇవెందుకు బాగా ఆడలేదని ఆశ్చర్యపోయారు. స్వాతిముత్యం విషయంలోనూ ఇదే జరుగుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది.

ముందు ఈ నెల 28న డిజిటల్ రిలీజ్ అనుకున్నారు కానీ.. తర్వాత ఆలోచన మార్చుకున్నారు. దీపావళి కానుకగా ఈ నెల 24 నుంచి ఆహాలో ప్రసారం కాబోతోంది స్వాతిముత్యం. మరి థియేటర్లలో సరిగా ఆడలేకపోయిన ఈ చిత్రం డిజిటల్‌గా అయినా ప్రేక్షకులను అలరించి మంచి వ్యూయర్‌షిప్ తెచ్చుకుంటుందేమో చూడాలి. బెల్లంకొండ గణేష్ కథానాయికుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది. కొత్త దర్శకుడు లక్ష్మణ్ రూపొందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.