ప్ర‌భాస్ టీం మోసం చేసింది-మంచు విష్ణు

ప్ర‌భాస్ కొత్త సినిమా ఆదిపురుష్ టీజ‌ర్ చూసి మెచ్చిన వారి కంటే.. తీవ్ర నిరాశ‌కు గురైన వాళ్లే ఎక్కువ‌. ఈ మ‌ధ్య కాలంలో ఈ టీజ‌ర్‌కు వ‌చ్చినంత నెగెటివ్ రెస్పాన్స్ మ‌రే సినిమా ప్రోమోకు రాలేదంటే అతిశ‌యోక్తి లేదు. ముఖ్యంగా ఇది యానిమేష‌న్ మూవీలా ఉండ‌డం.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం.. రావ‌ణుడు, హ‌నుమంతుడు పాత్ర‌ల విచిత్ర‌ వేష‌ధార‌ణ.. ఇలా అనేక అభ్యంత‌రాలే వ్య‌క్త‌మ‌య్యాయి టీజ‌ర్ విష‌యంలో.

ఐతే సామాన్య ప్రేక్ష‌కులే కాదు.. సెల‌బ్రెటీలు సైతం ఈ టీజ‌ర్ విష‌యంలో నిరాశ చెందార‌న‌డానికి టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం. ఆదిపురుష్ టీజ‌ర్ చూసి తాను కూడా బాగా డిజ‌ప్పాయింట్ అయ్యాన‌ని.. మోస‌పోయిన భావ‌న క‌లిగింద‌ని మంచు విష్ణు చెప్ప‌డం విశేషం. త‌న కొత్త చిత్రం జిన్నా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా అత‌నీ వ్యాఖ్య‌లు చేశాడు.

ఆదిపురుష్ టీజ‌ర్‌కు అంత నెగెటివ్ రెస్పాన్స్ రావ‌డానికి.. అది యానిమేటెడ్ మూవీ అనే సంకేతాలు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే అని మంచు విష్ణు అభిప్రాయ‌ప‌డ్డాడు. రామాయ‌ణం మీద సినిమా, ప్ర‌భాస్ హీరో అన‌గానే లైవ్ యాక్ష‌న్ మూవీ అనే ఎవ‌రైనా అనుకుంటార‌ని, కానీ టీజ‌ర్ చూస్తే యానిమేటెడ్ సీన్లు క‌నిపించ‌డం అంద‌రూ డిజప్పాయింట్ అయ్యార‌ని.. తన‌కు కూడా ఆదిపురుష్ టీం చేత‌ మోసపోయిన ఫీలింగ్ క‌లిగింద‌ని మంచు విష్ణు తెలిపాడు.

ఒక తెలుగువాడిగా తాను ఈ మాట‌లు చెబుతున్నాన‌ని.. ముందుగా ప్రేక్ష‌కుల‌ను ప్రిపేర్ చేయ‌కుండా ఇలా మోసం చేస్తే.. వారి స్పంద‌న ఇలాగే ఉంటుంద‌ని విష్ణు అన్నాడు. ఇది యానిమేటెడ్ మూవీ అని ప్ర‌మోట్ చేసి ఉంటే అస‌లు ట్రోల్స్ అనేవే ఉండేవి కావ‌ని విష్ణు చెప్పాడు. మ‌రి విష్ణు లాంటి సెల‌బ్రెటీనే తన‌కు టీజ‌ర్ చూసి మోస‌పోయిన ఫీలింగ్ క‌లిగింద‌ని అన్నాడంటే.. ఇక సామాన్య ప్రేక్ష‌కుల స్పంద‌న గురించి అర్థం చేసుకోవ‌చ్చు.