మహేష్ సినిమా గురించి మొత్తం బుస్సే


త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే దీని బిజినెస్ గురించి తెగ వార్తలు వచ్చేశాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లని.. బిజినెస్ దాని మీద వంద కోట్లు ఎక్కువకే జరుగుతోందని.. బయ్యర్లకు రికార్డు రేట్లు చెబుతున్నారని.. మహేష్-త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్ చూపించి ఆడియో హక్కులనే రూ.25-30 కోట్ల మధ్య చెబుతున్నారని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి ఈ సినిమా గురించి.

ఐతే ఈ ప్రచారాలన్నింటినీ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఖండించాడు. మామూలుగా చాలామంది సినిమా మేకింగ్ దశలో దాని గురించి ఎక్కువ చేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కానీ.. నాగవంశీ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. తమ సినిమా బిజినెస్ గురించి జరుగుతున్న ప్రచారాలన్నీ అతిశయోక్తులే అని తేల్చేశాడు.

మహేష్-త్రివిక్రమ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కట్లేదని నాగవంశీ ముందుగా క్లారిటీ ఇచ్చాడు. ఇది తెలుగు సినిమా అని తేల్చేశాడు. అలాంటపుడు రూ.300 కోట్ల బిజినెస్ ఎలా జరుగుతుందని అతనన్నాడు. అయినా ఈ సినిమాకు అసలు తాము బిజినెస్సే మొదలుపెట్టలేదని నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. తాము మామూలుగా ప్రొడక్షన్ కొంత అయ్యాక కానీ బిజినెస్ మొదలుపెట్టమని.. ఈ సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అన్నది కూడా తమకు ఇంకా క్లారిటీ లేదని నాగవంశీ తెలిపాడు.

ఇక ఆడియో హక్కుల గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు తెలుగు సినిమాల ఆడియో హక్కులు ఐదారు కోట్ల మధ్య పలుకుతున్నాయని.. ‘గాడ్ ఫాదర్’ సినిమా రైట్స్ రూ.6 కోట్లకు అమ్మారని.. అలాంటపుడు 25-30 కోట్లు ఎవరిస్తారని అతను ప్రశ్నించాడు. మొత్తానికి నాగవంశీ మాటల్ని బట్టి చూస్తుంటే మీడియాలో ఈ సినిమా బిజినెస్ గురించి జరుగుతున్న ప్రచారాలన్నీ బుస్సే అని తేలిపోయింది. ఐతే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు వారి కెరీర్లలో రికార్డు బిజినెస్ అయితే కచ్చితంగా జరిగే అవకాశముంది.