ఆచార్య దెబ్బ‌తో చిరు త‌గ్గాడు


కొవిడ్ కార‌ణంగా త‌లెత్తిన న‌ష్టాలు పూడ్చుకునే క్ర‌మంలో ప్ర‌భుత్వం స‌హ‌కారంతో టికెట్ల రేట్ల‌ను టాలీవుడ్ నిర్మాత‌లు మ‌రీ ఎక్కువ పెంచేయ‌డం.. అవి చాల‌వ‌ని పెద్ద సినిమాల‌కు తొలి వారం ప‌ది రోజుల్లో అద‌నంగా రేట్లు వ‌డ్డించ‌డం ప్రేక్ష‌కుల‌కు క‌డుపు మండిపోయేలా చేసింది. తెలంగాణ‌లో, ముఖ్యంగా హైద‌రాబాద్‌లో సింగిల్ స్క్రీన్ల‌లో రూ.250, మ‌ల్టీప్లెక్సుల్లో రూ.400 పెట్టి సినిమాలు చూడాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది ఒక స‌మ‌యంలో.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాల‌ను ఇక త‌ప్ప‌ద‌న్న‌ట్లు ఆ రేట్ల‌కే చూసిన ప్రేక్ష‌కులు.. ఆ త‌ర్వాత ఇదే రేట్ల‌తో వ‌చ్చిన ఆచార్య‌, స‌ర్కారు వారి పాట లాంటి చిత్రాల‌కు ముఖం చాటేశారు. స‌ర్కారు వారి పాట అయినా ఓ మోస్త‌రుగా ఆడింది కానీ.. డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్న ఆచార్య మాత్రం అడ్ర‌స్ లేకుండా పోయింది. ఆ త‌ర్వాత కూడా కొన్ని పెద్ద, మీడియం రేంజ్ సినిమాల మీద ఈ ధ‌ర‌ల ప్ర‌భావం బాగానే ప‌డింది. దీంతో టాలీవుడ్ నిర్మాత‌లు అస‌లుకే మోసం వ‌స్తోంద‌ని గ్ర‌హించి టికెట్ల రేట్ల విష‌యంలో దిగి వ‌చ్చారు.

ఆచార్య సినిమాకు త‌గిలిన ఎదురు దెబ్బ చూసి చిరు కొత్త సినిమా విష‌యంలో దాని నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు బాగానే జాగ్ర‌త్త ప‌డ్డ‌ట్లున్నారు. మ‌ల్టీప్లెక్సుల్లో అద‌న‌పు రేట్ల‌ను ప‌క్క‌న పెడితే రూ.295, సింగిల్ స్క్రీన్ల‌లో రూ.175 వ‌ర‌కు రేటు పెట్టుకునే అవకాశం ఉన్నా, చిరు సినిమాకు ఆ రేట్లు మ‌రీ ఎక్కువ కాక‌పోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నా.. అంత ధైర్యం చేయ‌లేక‌పోయారు. సింగిల్ స్క్రీన్ల‌లో రూ.150, మ‌ల్టీప్లెక్సుల్లో రూ.200తో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

హైద‌రాబాద్ ఏఎంబీ ఎప్ప‌ట్లాగే 295 రేటును కొన‌సాగిస్తుండ‌గా.. ఏవో కొన్ని మ‌ల్టీప్లెక్సులు మాత్రమే 250 రేటు పెట్టాయి. మిగ‌తా మ‌ల్టీప్లెక్సులన్నీ రూ.200 ధ‌రే ఫిక్స్ చేశాయి. ఇలా రీజ‌న‌బుల్ రేట్లు పెడితే, సినిమాకు టాక్ బాగుంటే క‌చ్చితంగా ఆక్యుపెన్సీ పెర‌గ‌డానికి అవ‌కాశ‌ముంటుంది. మేజ‌ర్, విక్ర‌మ్, సీతారామం, బింబిసార, కార్తికేయ‌-2 లాంటి చిత్రాలు ఇలాగే బాగా ప్ర‌యోజ‌నం పొందాయి. గాడ్ ఫాద‌ర్ టీం కూడా పెద్ద సినిమా అని బ‌డాయికి పోకుండా రీజ‌న‌బుల్ రేట్ల‌తో దిగ‌డం మంచి విష‌య‌మే. నాగ్ మూవీ ది ఘోస్ట్ కూడా ఇదే వ్యూహాన్ని అనుస‌రిస్తోంది.