పృథ్వీకు కోర్టు షాక్

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పృథ్వీకు మంచి పేరున్న సంగతి తెలిసిందే. “30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ” అన్న డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీ తనదైన టైమింగ్ తో డైలాగులు చెబుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, తెరమీద అందరినీ నవ్విస్తున్న పృథ్వీ తెర వెనుక వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా తన భార్య శ్రీలక్ష్మికి పృథ్వీ దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే పృథ్వీపై ఆమె భార్య శ్రీలక్ష్మి కొద్ది నెలల క్రితం విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టారు. 2016లో తనను పృథ్వీ ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, దీంతో గత్యంతరం లేక తాను పుట్టింట్లో ఉంటున్నానని శ్రీలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే 2017లో భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతూ శ్రీలక్ష్మి విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. పెళ్లైన కొత్తలో తన భర్త పృథ్వీ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉండేవారని, అక్కడి నుంచి చెన్నైకి వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వారని ఆ ఫిర్యాదులో శ్రీలక్ష్మి పేర్కొన్నారు.

అప్పట్లో ఆ ఖర్చులన్నీ తన తల్లిదండ్రులు భరించే వారని శ్రీలక్ష్మి అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీలక్ష్మి పెట్టిన కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. శ్రీలక్ష్మికి నెలకు 8 లక్షల రూపాయల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రకారం విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని తీర్పు చెప్పారు.

ఈనెల 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించారు. అంతేకాదు, శ్రీలక్ష్మి కేసు దాఖలు చేసిన 2017 నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లికి చెందిన బాలిరెడ్డి పృథ్వీ (శేషు)కి 1984లో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.