అపరిచితుడి అభిమానులకు నిరాశ

భారీ అంచనాల మధ్య విడుదలైన పొన్నియన్ సెల్వన్ 1 ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాబట్టుకోలేదని తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ టాక్, రివ్యూలు చూస్తే అర్థమైపోతోంది. కన్ఫ్యూజ్ చేసే నెరేషన్ తో మణిరత్నం మేజిక్ ఇందులో పని చేయకపోగా రెండో భాగం మీద ఆసక్తి కలిగించడంలోనూ ఫెయిలైనట్టే. తమిళ మీడియా మాత్రం ఆహా ఓహో అంటూ తెగ మోసేస్తూ వారం దాకా ఎక్కడ టికెట్లు లేవన్నంత హడావిడి చేస్తోంది కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. వీకెండ్ మినహాయించి చెన్నై బుక్ మై షోలోనూ ఈజీగా దొరుకుతున్నాయి. బాక్సాఫీస్ స్టేటస్ మీద అప్పుడే కంక్లూజన్ కు రాలేం కానీ కొంచెం వెయిట్ చేయాలి.

విక్రమే పొన్నియన్ సెల్వన్ అన్నంత బిల్డప్ ఇచ్చిన యూనిట్ తీరా టైటిల్ రోల్ చేసింది జయం రవిగా చూపించడంతో ఆడియెన్స్ షాక్ తిన్నారు. అది కూడా అతని ఎంట్రీ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. చియాన్ విక్రమ్ ఉండేది మొత్తం రెండు గంటల యాభై నిమిషాల నిడివిలో పావు గంట కంటే ఎక్కువ లేదు. కనీసం ఒక పాట కూడా పెట్టలేదు. ఇంట్రోలో ఓ చిన్న యుద్ధం, రెండు మూడు ఎమోషనల్ సీన్లు మినహాయించి ఇంకెక్కడా కనిపించడు. ఫస్ట్ హాఫ్ లో కార్తీ, సెకండ్ హాఫ్ లో జయం రవి డామినేషన్ తోనే మమ అనిపించేశారు. దీంతో అపరిచితుడి అభిమానులకు నిరాశ తప్పలేదు.

పిఎస్ 2లో విక్రమ్ పాత్ర పూర్తి స్థాయిలో ఉండొచ్చుగాక. అదేదో ముందే చెప్పాల్సింది. కేవలం తన పెర్ఫార్మన్స్ కోసమే థియేటర్ కు వెళ్ళినవాళ్ళు ఉంటారు. ఇలా చేయడం చీటింగని ఫీలయ్యే వాళ్ళు ఉంటారు. మొత్తానికి పైన చెప్పిన ఇద్దరు హీరోలు, ఐశ్వర్య రాయ్, త్రిష ఫ్యాన్స్ మాత్రమే స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా సంతృప్తిగా ఫీలయ్యారు తప్పించి మిగిలిదంతా సోసోనే. శని ఆదివారాలు సంగతి ఎలా ఉన్నా దసరాలోపే ఏపి, తెలంగాణలో పొన్నియన్ సెల్వన్ చల్లారిపోయేలా ఉంది. సీక్వెల్ షూటింగ్ ముందే పూర్తి చేశారు కాబట్టి 2023లోనే వచ్చేస్తుంది. అదైనా అంచనాలు పూర్తిగా అందుకుంటుండేదేమో చూడాలి.