పాడు చేసేసిన రాజమౌళి

‘బాహుబలి’ సినిమా చూసి దేశమంతా ఊగిపోతే.. ‘ఆర్ఆర్ఆర్’ చూసి హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఉర్రూతలూగిపోతే.. రాజమౌళి ఏం తప్పు చేశాడు… ఏం పాడు చేసేశాడు అని ఆశ్చర్యం కలుగుతోందా? ఇందులో నెగెటివ్ సెన్స్ ఏమీ లేదులెండి. ఆయన పాడు చేసింది మన బుర్రల్ని, ఆలోచనల్ని. ఇలా ఫీలవుతున్నది మిగతా ఫిలిం మేకర్సే. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల విషయంలో ప్రేక్షకుల ఆలోచన ధోరణి ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్లు తయారైపోయింది.

ఆ సినిమా చూసిన దగ్గర్నుంచి యుద్ధ సన్నివేశాలంటే ఎలా ఉండాలో.. సెట్టింగ్స్ అంటే ఏ స్థాయిలో ఉండాలో.. హీరో ఎలివేషన్ అంటే ఎలా ఉండాలో ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని ప్రతి భారీ చిత్రాన్నీ అదే కోణంలో చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. కానీ రాజమౌళి విజన్.. ఆయన ఎలివేషన్.. ఆయన విజువలైజేషన్‌ను మ్యాచ్ చేయడం వేరే దర్శకుల వల్ల కావడం లేదు. కనీస స్థాయిలో కూడా రాజమౌళి నెలకొల్పిన ప్రమాణాలను అందుకోలేక ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తున్నారు.

కొన్ని నెలల కిందటే మలయాళంలో ‘మరక్కార్’ అనే భారీ చిత్రం వచ్చింది. అక్కడ నంబర్ వన్ హీరో అయిన మోహన్ లాల్ ప్రధాన పాత్రలో లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ భారీ బడ్జెట్లో ఈ సినిమాను రూపొందించాడు. ‘బాహుబలి’తో మ్యాచ్ చేసే విధంగా ఈ చిత్రానికి అన్ని వనరులూ సమకూరాయి. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న కథతోనే సినిమాను రూపొందించారు. కానీ తీరా చూస్తే.. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కథలో దమ్ము లేదు. కథనంలో ఊపు లేదు. హీరో ఎలివేషన్లు లేవు. డ్రామా పండలేదు. యాక్షన్ ఘట్టాలు అనుకున్నంత లేవు. విజువల్స్ కొంత గ్రాండ్‌గా కనిపించాయి తప్ప ఇంకే హైలైట్లూ లేవు ఈ చిత్రంలో.

ఇప్పుడు తమిళ ఫిలిం ఇండస్ట్రీలోని అగ్ర తారాగణంతో వందల కోట్ల బడ్జెట్లో లెజెండరీ ఫిలిం మేకర్ మణిరత్నం రూపొందించిన ‘పొన్నియన్ సెల్వన్’ కూడా ఇదే కోవలోకి చేరింది. గొప్ప కథ అంటూ ‘పొన్నియన్ సెల్వన్’ నవల గురించి చాలా చర్చ జరిగింది కానీ.. సినిమా చూస్తే అంత గొప్పగా అనిపించలేదు. ‘బాహుబలి’ తరహా ఎలివేషన్లు, ఎమోషన్లు, భారీ యుద్ధ సన్నివేశాలు ఆశించిన వారికి తీవ్ర నిరాశ తప్పలేదు.

మరక్కార్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు చూశాక రాజమౌళి గొప్పదనం ఏంటన్నది మరోసారి అందరికీ అర్థమవుతోంది కేవలం భారీగా ఖర్చు పెట్టినంత మాత్రాన రాజమౌళిలా అందరూ అదిరే ఔట్ పుట్ తీసుకురాలేరని.. ఆయనలా ప్రేక్షకులను ఉద్రేకానికి, ఉద్వేగానికి గురి చేయడం అందరికీ సాధ్యం కాదని.. హీరో ఎలివేషన్లలో, ఎమోషన్లు పండించడంలో, యాక్షన్ ఘట్టాలను రోమాంచితంగా తీర్చిదిద్దడంలో రాజమౌళికి రాజమౌళే సాటని.. ఆయనలా మరే దర్శకుడూ అన్ని రసాలనూ పండించలేడని, తెరపై భారీతనాన్ని తీసుకురాలేరని మరోసారి రుజువైంది.