మేజర్ 777 ఛార్లీ తర్వాత గణేషే

అసలే ఇది సోషల్ మీడియా కాలం. కొత్త సినిమా ఏదైనా రిలీజ్ రోజు పెద్దా చిన్నా తేడా లేకుండా ప్రసాద్ ఐమ్యాక్స్ 8.45 షో పూర్తవ్వడం ఆలస్యం దాని తాలూకు టాక్ ప్రపంచమంతా పాకిపోతోంది. అక్కడే కాదు ఈ మధ్య బిసి సెంటర్స్ లో కూడా మైకులు పెట్టి మరీ మొదటి ఆట నుంచి బయటికి వచ్చిన ఆడియన్స్ తో రివ్యూలు చెప్పిస్తున్నాయి యూట్యూబ్ ఛానల్స్. వీటి ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పలేం కానీ అంతో ఇంతో ఉన్న మాట వాస్తవం. అలాంటిది ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. రాజమౌళి అంతటి వాడే ఆర్ఆర్ఆర్ కు ఆ సాహసం చేయలేకపోయారు.

కానీ బెల్లంకొండ గణేష్ ని హీరోగా లాంచ్ చేస్తున్న స్వాతిముత్యం నిర్మాతలు ఆ రిస్క్ కి సిద్ధపడినట్టు కనిపిస్తోంది. అక్టోబర్ 4 సాయంత్రమే కొన్ని ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేసే నిర్ణయం తీసుకున్నారట. ఎలాగూ పండగ రోజు చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ హడావిడే ఉంటుంది కాబట్టి ఈ మూవీ మీద జనం దృష్టి అంతగా ఉండదు. అలా కాకుండా ముందస్తుగా టాక్ పాజిటివ్ గా బయటికి వెళ్తే చిరు నాగ్ కు టికెట్లు దొరకని ఫ్యామిలీస్ దీనికి వచ్చే అవకాశం ఉంటుంది. అసలే దసరా మూడ్ కాబట్టి థియేటర్లకొచ్చే పబ్లిక్ భారీగా ఉంటుంది.

ఈ మధ్య మేజర్, 777 ఛార్లీకి ఇలాగే చేస్తే బ్రహ్మాండమైన ఫలితం దక్కింది. విరాట పర్వం సైతం మీడియాకు ప్రదర్శించారు కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం దక్కలేదు. కానీ స్వాతిముత్యం ఎంటర్ టైనర్ జానర్ లో తీశారు కాబట్టి ఆ నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ట్రైలర్ మరీ ఎక్స్ ట్రాడినరీగా అనిపించలేదు కానీ ఫన్ ఉందనే గ్యారెంటీ అయితే దక్కింది. అర్జున్ రెడ్డి టైంలోనూ ఇలాగే చేశారు. మాములు రెస్పాన్స్ రాలేదు. దెబ్బకు రిలీజ్ రోజు షోలు ఫుల్ అయ్యాయి. స్వాతిముత్యంకు అంత బజ్ లేదు కానీ అన్ని కోణాల్లో అలోచించి ఈ స్టెప్పు తీసుకుంటున్నారు కాబట్టి చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో.