పొన్నియన్ సెల్వన్.. దిల్ రాజు రిస్క్


ప్రస్తుతం తమిళ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. పొన్నియన్ సెల్వన్. మూడు దశాబ్దాల కలను నెరవేర్చుకుంటూ మణిరత్నం ఈ మెగా ప్రాజెక్టులో తొలి భాగాన్ని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ సినిమాపై తమిళంలో భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ సినిమాల రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొట్టేస్తుందన్న ధీమాతో అక్కడి వాళ్లు ఉన్నారు. దీని బడ్జెట్, కాస్టింగ్ అన్నీ కూడా వేరే లెవెల్లోనే ఉన్నాయి.

ఐతే తమిళం కాకుండా ఇతర భాషల్లో ఈ సినిమాకు బజ్ ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ వీక్‌లో భారీ పబ్లిసిటీ సినిమాకు హైప్ పెంచాలని ఆయన చూస్తున్నారు. ఇప్పటిదాకా ఆసక్తి ఎలా ఉన్నా సరే.. రిలీజ్ టైంకి వచ్చేసరికి జనాలు థియేటర్లకు బాగానే వస్తారని ఆయన ధీమాతో ఉన్నారు.

మణిరత్నంకు తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది. ఇందులో ముఖ్య పాత్రలు పోషించిన నటీనటులంతా తెలుగు వారికి బాగానే పరిచయం. ఇలాంటి భారీ చిత్రాల పట్ల తెలుగు ప్రేక్షకుల ఆసక్తి కూడా వేరుగా ఉంటుంది. అన్నిటికీ మించి తెలుగులో దీనికి పోటీగా వేరే సినిమాలేవీ కూడా లేకపోవడం దిల్ రాజు ధీమాకు కారణం కావచ్చు. ఈ కాన్ఫిడెన్స్‌తోనే ‘పొన్నియన్ సెల్వన్’కు టికెట్ల రేట్లు కూడా ఎక్కువగానే పెట్టారు.

మల్టీప్లెక్సుల్లో భారీ తెలుగు చిత్రాలకు పెట్టినట్లే రూ.295 రేటు ఫిక్స్ చేశారీ చిత్రానికి. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపితే రేటు రూ.330 అవుతోంది. మల్టీప్లెక్సులన్నీ కామన్‌గా ఇదే రేటుతో సినిమాను ప్రదర్శించబోతున్నాయి. సింగిల్ స్క్రీన్లలో రూ.175 రేటు ఫిక్స్ చేశారు. మామూలుగా తెలుగులో వచ్చే పెద్ద సినిమాలకే ఈ రేటు పెడుతుంటారు. ఐతే దీని వల్ల ఫుట్ ఫాల్స్ తగ్గిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రానికి రేటు తగ్గించడంతో ఆక్యుపెన్సీ పెరగడాన్ని బట్టి.. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా, ఎంత మొత్తానికి కొన్నా కూడా రేట్లు తగ్గించి ఆక్యుపెన్సీ పెంచుకోవడం ద్వారా ప్రయోజనం పొందొచ్చని.. ఇంతేసి భారీ రేట్లుంటే ఫుట్ ఫాల్స్ పడిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దిల్ రాజు అన్నీ తెలిసి ఎందుకింత రిస్క్ చేస్తున్నాడో?