దుల్కర్ ను హర్ట్ చేసిన ఆ ట్రోల్

సౌత్ ఇండియాలో కొత్త తరం హీరోల్లో అత్యుత్తమ నటుల్లో ఒకరిగా పేరు సంపాదించాడు దుల్కర్ సల్మాన్. లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ఘన వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను.. ఏ రోజూ కూడా తండ్రిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. ఆయన పేరును వాడుకోవడానికి చూడలేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.

అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ గొప్ప నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ‘సీతారామం’తో అతను ఎలా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడో తెలిసిందే. అతడి కెరీర్లో ఇలాంటి అద్భుతమైన పాత్రలు, గొప్ప సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ‘చార్లి’ కూడా ఒకటి. ఇది గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అలాగే దుల్కర్ నటనకూ ప్రశంసలు దక్కాయి. ఐతే 2016లో ‘చార్లి’ సినిమాకు గాను కేరళ ప్రభుత్వం అతణ్ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేయగా.. దాని పట్ల సోషల్ మీడియాలో జరిగిన ఒక ట్రోల్ దుల్కర్ ను ఎంతగానో బాధ పెట్టిందట.

ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ వెల్లడించాడు. తనను కేరళ ప్రభుత్వం ఉత్తమ నటుడిగా ప్రకటించాక ఒక నెటిజన్ ట్విట్టర్లో.. ‘‘నీ అవార్డును అమ్మాలనుకుంటున్నావా.. అయితే నాకిచ్చేయ్. నువ్వు కొన్నదానికంటే రూ.50 వేలు ఎక్కువ ఇస్తా’’ అంటూ దుల్కర్ ఫొటో పెట్టి కామెంట్ చేశాడట. ఇది చూసి ఎంతో నిరాశకు, బాధకు గురయ్యానని దుల్కర్ చెప్పాడు. కెరీర్ ఆరంభంలో తాను విమర్శలు ఎదుర్కొన్నానని, తర్వాత తన నటనకు మెరుగులు దిద్దుకుని నిలబడ్డానని.. తనకు అవార్డు వచ్చినపుడు ఇలా ట్రోల్ చేయడం చూసి ఎంతో బాధగా అనిపించిందని.. తాను అవార్డు కొనుక్కోవాలంటే కెరీర్ మొదట్లోనే చేసుకునేవాడినని.. అంత వరకు ఆగేవాడినా అనిపించిందని దుల్కర్ తెలిపాడు.

ఐతే ఒక స్నేహితుడు ఆ సందర్భంలో తనకు ఆ సమయంలో ఓదార్పునిచ్చే మాటలు చెప్పాడని.. అవార్డులు అప్పుడు చేసిన పనికి ఇచ్చిన గుర్తింపు కాదని, భవిష్యత్తులో మరింత మంచి సినిమాలు చేయడానికి ఇచ్చే ప్రోత్సాహం కాదని, ఇలాంటివి పట్టించుకోవద్దని అతను చెప్పడంతో తాను ఆ బాధ నుంచి బయటికి వచ్చానని దుల్కర్ వెల్లడించాడు.