నిఖిల్ డైరెక్టర్ హర్టు?

నిఖిల్ ‘స్వామి రారా’ చిత్రంతో ఇటు ప్రేక్షకులను, అటు ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యానికి గురి చేసిన దర్శకుడు సుధీర్ వర్మ.. నాకు నచ్చిన ప్రతి సినిమా నుంచి నేను కాపీ కొడతాను.. అని ఈ సినిమా టైటిల్స్‌లో స్టేట్మెంట్ వేసుకున్న బోల్డ్‌నెస్ అతడిది. ఈ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ తీసిన క్రైమ్ కామెడీస్‌తో పాటు హాలీవుడ్లో కొన్ని సినిమాల ఛాయలు కనిపించినా సరే.. జనాలకు అదేమీ అభ్యంతరకరంగా అనిపించలేదు. సినిమా ఆద్యంతం ఆకట్టుకోవడంతో దాన్ని సూపర్ హిట్ చేశారు.

ఐతే సుధీర్ ఆ తర్వాత తన మీద నెలకొన్న భారీ అంచనాలను అందుకోలేకపోయాడు. దోచెయ్, కేశవ, రణరంగం.. ఇలా వరుసగా మూడు చిత్రాలతో నిరాశ పరిచాడు. ప్రస్తుతం అతను మాస్ రాజా రవితేజతో ‘రావణాసుర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీని కంటే ముందు అతను లో బడ్జెట్లో ఒక కొరియన్ మూవీ ఆధారంగా సురేష్ ప్రొడక్షన్ నిర్మాణంలో ‘శాకిని డాకిని’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ నెల 16నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఐతే ఈ సినిమా ప్రమోషన్లలో సుధీర్ ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాదు.. ట్విట్టర్లో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయట్లేదు. కనీసం తన సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా దాని లింక్ కూడా అతను ట్విట్టర్లో పోస్ట్ చేయలేదు. ఓవైపు దాని టీం అంతా ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తుంటే సుధీర్ మాత్రం సైలెంటుగా ఉన్నాడు. ఈ సినిమా మేకింగ్‌ చివరి దశలో అతణ్ని పక్కన పెట్టడమే ఇందుకు కారణం అంటున్నారు.

తాను లాక్ చేసిన స్క్రిప్టులో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు ‘ఓయ్’ దర్శకుడు ఆనంద్ రంగతో మళ్లీ మార్పులు చేయించడంతో సుధీర్ హర్టయ్యాడని.. దీంతో అతను షూటింగ్ చివరి దశలో తప్పుకున్నాడని.. మిగతా పని ఆనంద్‌తోనే చేయించారని.. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కూడా అతనే డీల్ చేస్తున్నాడని.. ఈ విషయంలో హర్టయిన సుధీర్ ఈ చిత్రంతో తనకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఐతే చిత్ర బృందం మాత్రం దర్శకుడిగా పోస్టర్ల మీద సుధీర్ పేరే వేసి, అతడికి మంచి ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం.