టాలీవుడ్ సమస్యలు – నిర్మాతల పరిష్కారాలు

నెల రోజులకు పైగా షూటింగులకు బందు పెట్టి మరీ తమ సమస్యల గురించి తీవ్ర చర్చలు జరుపుకున్న నిర్మాతలు ఎట్టకేలకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని ముందే లీకైనవి ఉండగా మరికొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఇకపై ఆర్టిస్టులకిచ్చే రెమ్యునరేషన్ లోనే మొత్తం ఖర్చులు ఉండాలని, అదనంగా మోపే ఎలాంటి చెల్లింపులైనా సరే ఇకపై ఉండవని తేల్చేసింది. టెక్నీషియన్లకు సైతం ఇది వర్తిస్తుంది.

అగ్రిమెంట్లు ముందే చేసుకుని ఫిలిం ఛాంబర్ దగ్గర ధృవీకరణ చేసుకోవాలి. కాల్ షీట్లు, టైమింగ్స్ కూడా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నాయి. కీలకమైన ఓటిటి గ్యాప్ ఇకపై 8 వారాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ లో డిజిటల్ పార్ట్ నర్ ఎవరో ముందే ప్రకటించే విధానానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ మధ్య కాలంలో సెన్సార్ సర్టిఫికెట్ పడటం ఆలస్యం వెంటనే ఓటిటి లోగోతో కూడిన స్లయిడ్ వస్తోంది. ఇకపై పోస్టర్లలోనూ అలా ఉండటానికి వీల్లేదు.

వర్చువల్ ప్రింట్ ఫీజుకు సంబంధించి మరో దఫా చర్చలు సెప్టెంబర్ 6న జరుగుతాయి. తెలంగాణలో తీసుకొచ్చే విధానాన్నే ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేయబోతున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసుకున్నారు. సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన క్లారిటీ మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. నిర్మాణ సంస్థలతో మరోసారి చర్చించి ఫైనల్ గా కొన్ని మార్పులు చేస్తారు.

అయితే థియేటర్లలో విపరీతంగా పెరిగిపోతున్న స్నాక్స్ ధరలు, జిఓని వాడుకుని పెంచేస్తున్న టికెట్ రేట్ల గురించి మాత్రం ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఇలాగే కొనసాగాలని డిసైడ్ అయ్యారా లేక మళ్ళీ డిస్కస్ చేస్తారా స్పష్టత లేదు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అమలు చేయడంలోనే అసలైన సవాళ్లు రాబోతున్నాయి. ముఖ్యంగా పారితోషికాలు, ఓటిటి గ్యాపులు తదితర అంశాల పట్ల ఆయా భాగస్వాములు ఎలా స్పందిస్తారనేది కీలకం కానుంది. చూద్దాం.