రీ రిలీజులు – ప్రమాదమా ప్రమోదమా

ఈసారి వినాయకచవితి పండగ హడావిడి కొత్త సినిమాలకన్నా ఎక్కువగా పాత బ్లాక్ బస్టర్లతో జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వేసిన తమ్ముడు, జల్సా ప్రీమియర్లకు వస్తున్న స్పందనకు ట్రేడ్ సైతం షాక్ తింది. ఎక్కడో బెంగళూరులో ఉన్న తిరుమల థియేటర్ హౌస్ ఫుల్ కావడం ఏమిటో, ఉదయాన్నే పూజాదికాలు పెట్టుకుని సుదర్శన్ 35 ఎంఎంకు ఉదయం 8 గంటలకు జనాలు తండోపతండాలుగా రావడం ఏమిటో అంతా మాయగా ఉందని ఫ్యాన్సే చెప్పుకుంటున్నారు.

దీనికి నాంది ఎప్పుడో పడినా ఊపందుకుంది మాత్రం ఆ మధ్య వచ్చిన ఒక్కడు, పోకిరిలతోనే. ఘరానా మొగుడుకు సైతం కొన్ని సెంటర్లలో మంచి వసూళ్లు వచ్చాయి. దెబ్బకు అక్టోబర్ 23న రాబోయే ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని బిల్లా 4K ప్రింట్ ని రీ మాస్టర్ చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా చాలా టైం ఉన్నప్పటికి డార్లింగ్ ఫ్యాన్స్ ఆల్రెడీ సోషల్ మీడియా ట్రెండింగ్ మొదలుపెట్టారు.

గతంలో ఆది, మగధీర, చెన్నకేశవరెడ్డి లాంటివి క్రాస్ రోడ్స్ కే పరిమితమైతే ఇప్పుడు వస్తున్నవి ఏకంగా తెలుగు రాష్ట్రాలు దాటి ఓవర్ సీస్ దాకా వెళ్లిపోయాయి. ఇదంతా బాగానే ఉంది కానీ వీటి ప్రభావం నేరుగా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న కొత్త సినిమాల మీద పడుతోంది. ఉదాహరణకు ఐమ్యాక్స్ లో తమ్ముడు జల్సాలకు కలిపి రెండు రోజుల్లో సుమారు 30 దాక షోలు వేశారు.

అది కూడా పండగ సెలవుకి ఎక్కువ పడ్డాయి. ఒకవేళ ఇవి లేకపోతే బింబిసార, కార్తికేయ 2, సీతారామంలకు మరింత మైలేజ్ వచ్చేదనే లాజిక్ లో అర్థముంది. వారం తిరగని లైగర్ ని సైతం రీ ప్లేస్ చేశారు. ఈ ఒక్క కాంప్లెక్స్ లోనే పదిహేను లక్షలకు పైగా గ్రాస్ ని ఆ రెండు పవన్ సినిమాలు తీసుకుంటాయని అంచనా. ఈ లెక్కన ఇదో రెగ్యులర్ ట్రెండ్ గా మారితే కొత్తగా వచ్చే మీడియం బడ్జెట్, చిన్న చిత్రాలకు చిక్కులు తప్పవు. కొత్త మోజులా ఇవి కొంతకాలానికి ఆగుతాయా లేక కొనసాగుతాయా చూడాలి.