ఫుల్ జోష్‌లో ఆదిపురుష్

ప్రభాస్ అభిమానుల కొత్త ఆశ.. ఆదిపురుష్. ‘బాహుబలి’ తర్వాత ఎన్నో అంచనాలు పెట్టుకున్న సాహో, రాధేశ్యామ్ చిత్రాలు తీవ్రంగా నిరాశ పరచడంతో ఇక వాళ్ల దృష్టంతా ‘ఆదిపురుష్’ మీదే ఉంది. ‘తానాజీ’ లాంటి భారీ చిత్రం తీసిన ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇది. ఐతే ఈ చిత్ర షూటింగ్ గత ఏడాదే పూర్తయినా ఇప్పటిదాకా కనీసం ఒక ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయలేదు.

ఇంకే రకమైన విశేషాన్నీ పంచుకోలేదు. నెలల తరబడి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఎంత గోల చేసినా ఓం రౌత్ పట్టించుకోవడం లేదు. ఐతే అభిమానులను ఎంగేజ్ చేస్తూ అప్‌డేట్స్ ఇవ్వడం కంటే సినిమా క్వాలిటీ మీద దృష్టిపెట్టడం ముఖ్యం అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెమెరాతో షూట్ చేసిందానికంటే.. వీఎఫ్ఎక్స్‌తో చేయాల్సిన పని చాలా ఉండడంతో, దాని మీదే దృష్టిసారించాడట.

వరల్డ్ వైడ్ చాలా స్టూడియోల్లో ‘ఆదిపురుష్’ వర్క్ నడుస్తోంది. వాటితో కోఆర్డినేట్ చేసుకుంటూ.. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఓం రౌత్ అండ్ టీం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ పని మొత్తం పూర్తయి.. పర్ఫెక్ట్‌గా ఫైనల్ ఔట్ పుట్ వచ్చాక.. ప్రమోషన్ల కోసం రంగంలోకి దిగాలని చూస్తున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు వచ్చిందని, ఇంకో నెల రోజుల్లో పని మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. అక్టోబరు నుంచి ప్రమోషన్లను ఒకేసారి భారీ ఎత్తున మొదలుపెట్టనున్నారట. సంక్రాంతి వరకు గట్టిగానే సినిమాను ప్రమోట్ చేస్తారట.

ఇప్పటిదాకా అనుకున్నంత బజ్ లేకపోయినా.. ప్రస్తుతం భారతీయ ప్రేక్షకుల మూడ్ ‘ఆదిపురుష్’ లాంటి సినిమాలకు బ్రహ్మరథం పట్టే స్థితిలోనే ఉందని, ఇటీవల ‘కార్తికేయ-2’ సెన్సేషనల్ హిట్ కావడం అందుకు సూచిక అని.. శ్రీకృష్ణుడి గురించి కొంత మేర గొప్పగా చూపిస్తేనే అంత ఆదరించినపుడు రామాయణ గాథను భారీ స్థాయిలో, సరికొత్తగా ప్రెజెంట్ చేస్తే ఇంకెంత ఆదరిస్తారో అంచనా వేయొచ్చని..కాబట్టి అన్నీ సరిగ్గా కుదిరితే ‘ఆదిపురుష్’ సెన్సేషనల్ హిట్ కావడం గ్యారెంటీ అని విశ్లేషకులు అంటున్నారు.