ఆ కుర్రాడి దర్శకత్వంలో రవితేజ

మాస్ రాజా రవితేజకు ఈ ఏడాది రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. వేసవిలో వచ్చిన ఆయన సినిమా ‘ఖిలాడి’ డిజాస్టర్ కాగా.. జులై నెలాఖర్లో విడుదలైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాస్ రాజా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ‘ఖిలాడి’కి కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి, అందులో కొన్ని అంశాలు మాస్‌ ప్రేక్షకులను ఎంతో కొంత అలరించాయి. కానీ ‘రామారావు’ ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేక తొలి రోజు నుంచే ఖాళీ థియేటర్లతో వెలవెలబోయింది.

ఏదో కొంచెం భిన్నంగా ప్రయత్నిద్దామని చూస్తే అసలుకే మోసం వచ్చింది. ఈ నేపథ్యంలో రవితేజ మళ్లీ ప్రయోగాల జోలికి వెళ్లకపోవచ్చని, తన స్టయిల్లో మాస్ మసాలా సినిమాలే చేసుకుంటాడని అనుకున్నారంతా. కానీ రవితేజ మాత్రం అలా ఆలోచించట్లేదు. అతను మళ్లీ ఓ డిఫరెంట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అతను యంగ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట.

కార్తికేయ, ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమమ్, నిన్ను కోరి, డిస్కో రాజా, కార్తికేయ-2.. ఇలా చాలా సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసి మంచి పేరు సంపాదించిన కార్తీక్.. కెరీర్ ఆరంభంలోనే దర్శకుడి అవతారం ఎత్తాడు. నిఖిల్ హీరోగా ‘సూర్య వెర్సస్ సూర్య’ అనే సినిమా తీశాడు. ఒక ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన ఆ చిత్రం విడుదలకు ముందు ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తించినా, అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు కార్తీక్.

ఛాయాగ్రహణానికి పరిమితం అవుతూ వచ్చాడు. ఐతే ‘డిస్కో రాజా’కు పని చేసే క్రమంలో రవితేజతో సాన్నిహిత్యం ఏర్పడి, ఆయనకు ఒక కథ చెప్పి ఒప్పించాడట కార్తీక్. ఇది అతీంద్రయ శక్తుల చుట్టూ తిరిగే డిఫరెంట్ స్టోరీ అని, దీనికి ‘ఈగల్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రానుందట. ప్రస్తుతం మాస్ రాజా ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో పాటు చిరంజీవి కొత్త చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.