ఈ దర్శకుడిది మామూలు సుడి కాదు

ఏ రంగంలో అయినా అందరూ సక్సెస్‌ఫుల్ వ్యక్తుల చుట్టూనే తిరుగుతారు. సినీ రంగంలో సక్సెస్ రేట్ అన్నది చాలా చాలా తక్కువ కాబట్టి ఇక విజయానికి విలువ మరింత ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం ఉదయం సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే చాలు.. దర్శకుడి ఫోన్‌కు కాల్స్ మోత మోగిపోతుంది. సినిమా ఆఫర్లు, అడ్వాన్సులతో నిర్మాతలు హోరెత్తించేస్తారు. అదే కనుక సినిమా ఫ్లాప్ అయితే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతుంటాయి.

ఐతే చాలా కొద్ది మంది దర్శకులు మాత్రమే గత సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. పబ్లిసిటీ డిజైనర్ టర్న్డ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ కోవకే చెందుతాడు. దర్శకుడిగా అతడి తొలి చిత్రం ‘ఒక ఊరిలో’ పెద్ద డిజాస్టర్. ఆ తర్వాత కొరియన్ మూవీ ‘బైసికల్ థీవ్స్’ను కాపీ కొట్టి తీసిన ‘రైడ్’ ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత రవితేజతో చేసిన ‘వీర’ మూవీతో ఇంకో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.

ఆపై నాగశౌర్య హీరోగా రూపొందించిన ‘అబ్బాయితో అమ్మాయి’ కూడా ఆడలేదు. ఐతే కోనేరు సత్యనారాయణ అనే బిగ్ షాట్‌ను మెప్పించి ఆయన బేనర్లో రమేష్ వర్మ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రమేష్ కథతో ఈ బేనర్లో ‘సెవన్’ అనే సినిమా వచ్చింది. అదీ డిజాస్టరే. ఆ తర్వాత తమిళ హిట్ ‘రాక్షసుడు’ను మక్కీకి మక్కీ దించేస్తూ తీసిన ‘రాక్షసుడు’ ఓ మాదిరిగా ఆడింది. తర్వాత ఈ బేనర్లోనే ‘ఖిలాడి’ సినిమా చేస్తే అది పెద్ద డిజాస్టర్ అయింది. అయినా సరే.. ఇదే సంస్థలో ‘రాక్షసుడు-2’ను వంద కోట్ల బడ్జెట్లో తెరకెక్కించబోతున్నట్లు ఘనంగా అనౌన్స్‌మెంట్లు ఇస్తున్నారు.

ఈలోపు రమేష్ వర్మకు ఒక పాన్ ఇండియా సినిమాలో అవకాశం రావడం విశేషం. బాలీవుడ్ బేనర్ పూజా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించబోతోందట. ఈ సంస్థలో తాను చేయబోయే పాన్ ఇండియా మూవీ గురించి రమేషే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. ఇందులో స్టార్ హీరో, హీరోయిన్లు నటిస్తారట. ఈ ట్రాక్ రికార్డుతో బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్లో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం దక్కించుకోవడం అంటే ‘ఖిలాడి’ ఈవెంట్లో రవితేజ అన్నట్లు రమేష్ వర్మ మహర్జాతకుడే.