అవతార్ ప్రియులకు అదిరిపోయే న్యూస్

అవతార్.. 13 ఏళ్ల కిందట వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా. అప్పటి ప్రపంచ చలనచిత్ర కలెక్షన్ల రికార్డులన్నింటినీ అది తుడిచిపెట్టేసింది. తర్వాత కూడా చాలా ఏళ్ల పాటు ఆ రికార్డులు కొనసాగాయి. టికెట్ల ధరలు పెరగడం, వైడ్ రిలీజ్ వల్ల ఆ తర్వాత వేరే చిత్రాలు దాన్ని దాటగలిగాయి కానీ.. అప్పటి లెక్కల్లో చూస్తే ‘అవతార్’ ఇప్పటికీ నంబర్ వన్ సినిమా అనడంలో సందేహం లేదు. ఈ మెగా మూవీకి ఇంకో మూడు సీక్వెల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అందులో తొలి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఫస్ట్ పార్ట్ రిలీజై 13 ఏళ్లు అయిపోతోంది. సీక్వెల్ చూడాలంటే ముందు రివిజన్ అవసరం. అది టీవీల్లో, మొబైళ్లలో చూస్తే కిక్కుండదు. మళ్లీ వెండితెరపై ‘అవతార్’ వీక్షణం.. ఆ సినిమా ప్రియులందరికీ అవసరం. ఆ అవసరాన్ని గుర్తించే సెప్టెంబరు 23 నుంచి ఇండియా వైడ్ రెండు వారాల పాటు ‘అవతార్’ను థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.

రీ రిలీజ్ అంటే ఏదో నామమాత్రంగా కాకుండా పెద్ద ఎత్తునే ఉండబోతోంది. అన్ని ప్రధాన మల్టీప్లెక్సులూ దీనికి పెద్ద ఎత్తున షోలు కేటాయించబోతున్నాయి. 13 ఏళ్ల కిందట ‘అవతార్’ చూసినప్పటి కంటే ఇప్పుడు ఇంకా గొప్ప అనుభూతి ఉండబోతోంది. ఆ ప్రింట్‌ను రీమాస్టర్ చేసి 4కే రెజొల్యూషన్లో, ఇంకా బెటర్ సౌండ్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

సినిమాను త్రీడీలోనే చూపించబోతున్నారు. ఐమాక్స్ స్క్రీన్లలో 4కే రెజొల్యూషన్లో, అదిరిపోయే సౌండ్‌తో, త్రీడీలో సినిమా చూస్తే కలిగే అనుభూతే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ‘అవతార్-2’ చూడబోయే ముందు ఇది ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఇలా సినిమా చూశాక పర్ఫెక్ట్ మూడ్ క్రియేటవుతుంది కూడా. అప్పుడు ‘అవతార్-2’ మీద అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. ఏ సినిమా చేసినా ఒక యజ్ఞంలా చేసే జేమ్స్ కామెరూన్.. టైటానిక్ లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత 11 ఏళ్లు గ్యాప్ తీసుకుని ‘అవతార్’ చేశాడు. ఆ తర్వాత 13 ఏళ్లు అవతార్-2 కోసం వెచ్చించాడు. ఈ సారి మరింతగా ఆయన బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.