పూరీని ఇన్‌స్పైర్ చేసిన సుక్కు

టాలీవుడ్లో చాలామంది యువ దర్శకులు, రచయితలకు పూరి జగన్నాథ్ ఆదర్శం. ఆ మాటకొస్తే ఆయన కంటే ముందు నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు కూడా పూరీని చూసి ఇన్‌స్పైర్ అవుతుంటారు. అందులో లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఒకరు. పూరీని చూస్తే తనకు అసూయ అని, ఆయనలా రాయాలని తపిస్తుంటానని విజయేంద్ర వ్యాఖ్యానించడం తెలిసిందే. అంత టాలెంట్ ఉన్న పూరి.. తాను కూడా తన తర్వాత వచ్చిన దర్శకులు, రచయితలను చూసి స్ఫూర్తి పొందుతుంటానని చెబుతుంటాడు.

పూరి తర్వాత దర్శకుడిగా మారి ప్రస్తుతం ఆయన్ని మించిన స్థాయిలో ఉన్న సుకుమార్.. ఈ డాషింగ్ డైరెక్టర్‌ను ఇన్‌స్పైర్ చేశాడట. సుక్కు రూపొందించిన ‘పుష్ప’ చిత్రంలో క్లైమాక్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు ‘లైగర్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పూరి వెల్లడించాడు. ‘పుష్ప’ లాంటి పెద్ద యాక్షన్ సినిమాలో హీరో, విలన్ కలిసి కూర్చుని అంత సుదీర్ఘంగా మాట్లాడుకోవడం, అలా చేసి ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదని.. ఆ సిచువేషన్ తనకు బాగా నచ్చిందని పూరి తెలిపాడు.

‘లైగర్’లో సైతం ఇలాంటి భిన్నమైన క్లైమాక్సే ఉంటుందని పూరి సంకేతాలు ఇచ్చాడు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మధ్య వచ్చే పతాక సన్నివేశాలు చాలా భిన్నంగా ఉంటాయని, ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా వాటిని తీర్చిదిద్దామని పూరి తెలిపాడు. ఇక విజయ్‌తో ‘లైగర్’ సినిమా ఎలా సెట్ అయిందో వివరిస్తూ.. తాను అతడికి రెండు కథలు చెప్పగా ‘లైగర్’కే అతను కనెక్టయ్యాడన్నాడు.

ఇందులో తన పాత్ర కోసం కొంచెం బాడీ పెంచమంటే.. మామూలుగా ఉంటే ఈ పాత్ర పండదని చెప్పి, విపరీతంగా కష్టపడి బాడీ బిల్డ్ చేసి, జుట్టు పెంచి లుక్ మార్చుకుని తన పాత్రకు ప్రాణం పోశాడని పూరి విజయ్‌కి కితాబిచ్చాడు. ‘లైగర్’ ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా చేయాలన్న ఆలోచనలో పూరి, విజయ్ ఉన్నారు.