నాగచైతన్య సినిమా క్యాన్సిల్?

అక్కినేని నాగచైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా కొన్నేళ్ల ముందే పట్టాలెక్కాల్సింది. 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ అంతలోనే పరశురామ్‌కు అనుకోకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పని చేసే అవకాశం లభించింది. అంత పెద్ద ఛాన్స్ వచ్చేసరికి అతను.. హీరో, నిర్మాతలను ఒప్పించి చైతూ సినిమాను హోల్డ్‌లో పెట్టాడు. చైతూ కూడా వేరే సినిమాలతో బిజీ అయ్యాడు.

మహేష్‌తో పరశురామ్ తీసిన ‘సర్కారు వారి పాట’ ఆశించిన ఫలితాన్నయితే అందుకోలేదు. ఈ సినిమాకు ముందు నుంచి ఉన్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ సినిమా తర్వాత తడబడింది. కంటెంట్ పరంగా చూస్తే ఇది చాలా వీక్ మూవీ అనడంలో సందేహం లేదు. తొలిసారి ఓ పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడనే విమర్శ పరశురామ్ గురించి వినిపించింది.

‘సర్కారు వారి పాట’ అంచనాలకు తగ్గట్లు ఉంటే ఇంకో పెద్ద హీరో నుంచి పిలుపు వచ్చేదేమో. కానీ అలాంటిదేమీ జరగలేదు. అలా అని నాగచైతన్యతో సినిమా కూడా ఓకే అవ్వలేదు. కథా చర్చలు నడుస్తున్నాయి తప్ప.. సినిమా ఓకే అయినట్లయితే వార్తలు రావడం లేదు. స్వయంగా చైతూనే సినిమా చర్చల దశలో ఉన్నట్లు వెల్లడించాడు. అతను మూడు వారాల వ్యవధిలో రెండు గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు. తెలుగులో అతడి చివరి సినిమా ‘థాంక్యూ’ దారుణమైన ఫలితాన్నందుకుంది. హిందీలో డెబ్యూ చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా బోల్తా కొట్టింది.

ఈ పరిస్థితుల్లో తన కెరీర్‌పై అతను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం తనకు కొంచెం గ్యాప్ అవసరమని చైతూ భావిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ‘సర్కారు వారి పాట’ లాంటి సినిమా తీసిన పరశురామ్‌తో ఒక రొటీన్ మూవీ చేయడం అంత మంచిది కాదని అతను ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మార్కెట్ బాగా దెబ్బ తిన్న చైతూతో సినిమా చేయడంపై పరశురామ్ కూడా పునరాలోచిస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో ఈ సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్లే అని, ఇద్దరికీ అదే మంచిదని హీరో-డైరెక్టర్ ఎవరికి వాళ్లు ఫీలవుతున్నారని అంటున్నారు.