కొత్త దర్శకుడిని నమ్మనందుకు చింతిస్తున్నారు

ఎవరైనా కొత్త దర్శకుడు ఒక భారీ కథతో హీరోలు, నిర్మాతలను కలిసి నరేషన్ ఇవ్వగానే వాళ్ల నుంచి ఒక రొటీన్ ప్రశ్న ఎదురవుతుంటుంది. ఇంత భారీ కథను కొత్త వాడైన నువ్వు డీల్ చేయగలవా అని. ఎవరైనా పెద్ద దర్శకులకు ఈ కథ ఇస్తే బాగుంటుందేమో అని అభిప్రాయపడతారు. కానీ అంత భారీ కథను సమర్థంగా తీర్చిదిద్దుకుని ఆ సినిమాతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇద్దామని ప్రిపేరైన డెబ్యూ డైరెక్టర్లకు ఆ కథను వేరొకరికి అప్పగించడానికి మనసొప్పుకోదు. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు మనమే ఆ కథతో సినిమా చేద్దామని చూస్తారు.

ఈ క్రమంలో కొన్ని అవకాశాలు చేజారుతాయి. చివరికి ఆ కథను, దర్శకుడిని నమ్మి రిస్క్ చేస్తే.. అద్భుతాలు జరగొచ్చు. బింబిసార మూవీ అలాంటి అద్భుతమే అని చెప్పాలి. ఈ కథను వేణు మల్లిడి అలియాస్ వశిష్ఠ టాలీవుడ్లో చాలామంది హీరోలకు చెప్పాడు. ముందు అల్లు శిరీష్ హీరోగా ఈ సినిమా చేయడానికి అంతా ఓకే అన్నట్లే కనిపించింది. సినిమా కూడా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే ఎక్కడో ఏదో తేడా జరిగింది. సినిమా ముందుకు కదల్లేదు.

ఆ తర్వాత మాస్ రాజా రవితేజ వద్దకు వెళ్లాడు వశిష్ఠ. అక్కడ కూడా ముందు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోయారు. చివరికి ఇలాంటి రిస్కీ సినిమాలతోనే ఘన విజయాలందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ను ఓకే చేశాడు. పెద్ద బడ్జెట్లో, రాజీ పడకుండా సినిమా తీశాడు.
ఈ చిత్రం ఇప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

వశిష్ఠకు టాలీవుడ్ గ్రాండ్ వెల్కం చెబుతూ అతడి మీద ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. చాలామంది అతడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నాడు వశిష్ఠ. ఈ యువ దర్శకుడికి నో చెప్పి వేరే సినిమాలు చేసిన శిరీష్, రవితేజ ఇద్దరూ కూడా కెరీర్లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ‘బింబిసార’ సాధించిన విజయం చూసి ఈ కొత్త దర్శకుడిని నమ్మనందుకు వాళ్లు ఎంతో చింతిస్తూ ఉంటారనడంలో సందేహం లేదు.