వెంకటేష్ తొలి అడుగుకి 36 ఏళ్ళు

సరిగ్గా ముప్పై ఆరేళ్ళ క్రితం ఇదే రోజు విక్టరీ వెంకటేష్ నటించిన మొదటి సినిమా కలియుగ పాండవులు విడుదలయ్యింది. ఒకసారి ఆ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళొద్దాం. 1985. డాక్టర్ రామానాయుడు గారు అప్పటికే అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆ టైంలో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. చేతిలో దర్శకుడు కె రాఘవేంద్రరావు డేట్లున్నాయి. అవి వృథా కాకూడదు.

పరుచూరి బ్రదర్స్ సలహా మేరకు చిన్నబ్బాయి వెంకటేష్ ని హీరోగా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అమెరికాలో ఎంబిఎ చదువుతూ అడపాదడపా అక్కడ మోడలింగ్ చేస్తున్న వెంకటేష్ ని వెంటనే రమ్మని ఫోన్ చేశారు. నాన్న ఆర్డర్ వేశాక ఆగడం సాధ్యమా. ఈలోగా పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమైపోయింది. బడ్జెట్ కోటి రూపాయల దాకా అవ్వొచ్చని లెక్క తేలింది. ఎంత వారసుడైనా అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం. ప్రేమనగర్ టైంలోనే ఇలాంటి రిస్కులు చూసిన నాయుడుగారు ఆలోచించలేదు.

కొత్తమ్మాయి ఖుష్బూని హీరోయిన్ గా తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ని తెలుగుకు పరిచయం చేశారు. 1986 నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1 షూటింగ్ ప్రారంభమయ్యింది. ప్రారంభంలో కాస్త నెగటివ్ టచ్ తో మొదలై తర్వాత సమాజంలో మార్పు కోసం తాపత్రయపడే పాత్రలో వెంకీ పెర్ఫార్మన్స్ సెట్స్ లో ఉన్నప్పుడే ప్రశంసలు అందుకుంది. ఇందుకుగాను తీసుకున్న కఠిన శిక్షణ చాలా ఉపయోగపడింది.

చాలా పెద్ద క్యాస్టింగ్ తో హైదరాబాద్, మద్రాస్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. పబ్లిసిటీ ఘనంగా చేయడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 1986 ఆగస్ట్ 14న కలియుగ పాండవులను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. తీరా చూస్తే మొదటివారంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తుఫాను వచ్చింది. అయినా జనం ఆదరించారు. కమర్షియల్ గా టెన్షన్ పడిన బయ్యర్లకు ఈజీ గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. పద్నాలుగు సెంటర్స్ లో హాఫ్ సెంచరీ కొట్టింది. వంద రోజుల వేడుకను కృష్ణ , ముఖ్యఅతిథిగా విజయవాడలో ఘనంగా నిర్వహించారు. సినిమాలో వి ఫర్ విజయ్ అనే వెంకటేష్ డైలాగే తర్వాత క్రమంలో ఇంటి పేరుగా మారిపోయి దగ్గుబాటి హీరోకి తిరుగులేని స్టార్ డం ఇచ్చింది.