విక్రమ్ చూశాక నిద్ర పట్టలేదు: నితిన్

యువ కథానాయకుడు నితిన్ చివరి రెండు థియేట్రికల్ రిలీజ్‌లు అతడికి చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ‘రంగ్ దె’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుని కూడా థియేటర్లలో నిలవలేకపోయింది. బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ‘చెక్’ అందుకు తగ్గట్లే డిజాస్టర్ అయింది. వీటి తర్వాత అతను నటించిన ‘మ్యాస్ట్రో’ ఓటీటీలో విడుదలై ఓకే అనిపించుకుంది. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘మాచర్ల నియోజకవర్గం’ మీదే ఉన్నాయి.

ఐతే ఈ చిత్ర విడుదలకు రెండు నెలల ముందే నితిన్ సంస్థ నుంచి వచ్చిన కమల్ హాసన్ మూవీ ‘విక్రమ్’ ఘనవిజయాన్నందుకుంది. తెలుగులో పెద్దగా బజ్ లేకుండా రిలీజైన ఈ చిత్రం తర్వాత ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నితిన్ కుటుంబం రూ.6 కోట్లకు సినిమాను కొంటే తెలుగులో దాదాపు రూ.15 కోట్ల షేర్ రాబట్టిందీ చిత్రం.

ఈ సినిమా నితిన్ బేనర్ నుంచి రిలీజవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇదే బేనర్లో తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగిస్తుందని నితిన్ ఆశిస్తున్నాడు. ‘విక్రమ్’ సినిమాను తాము తెలుగులో రిలీజ్ చేయడం గురించి నితిన్ స్పందిస్తూ.. ‘‘విక్రమ్ సినిమా చూశాక నాకు వారం రోజులు నిద్ర పట్టలేదు. సినిమా అంటే ఇలా ఉండాలి కదా అనిపించింది. మనం కూడా ఇలా తీయాలి అన్న ఆలోచన వచ్చింది. కథను బలంగా నమ్మి చేస్తేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఈ తరహా సినిమాల కోసం హీరోలు త్యాగాలు చేయాలి. నా పాత్ర ఇలా ఉంటేనే చేస్తా.. మూడు పాటలుండాలి, నాలుగు ఫైట్లుండాలి అని లెక్కలు వేసుకోకూడదు. అలా చేస్తే ఇలాంటి సినిమాలు రావు.

మా బేనర్‌కు ‘విక్రమ్’ పెద్ద సక్సెస్ ఇచ్చింది’’ అని నితిన్ తెలిపాడు. ‘మాచర్ల నియోజకవర్గం’ తర్వాత తాను వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తున్నానని.. ఆ చిత్రం చకచకా షూటింగ్ జరుపుకుంటోందని చెప్పిన నితిన్.. దాని తర్వాత కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదన్నాడు. ఒకప్పుడు తాను వరుస ఫ్లాపుల ఎదుర్కొన్నానని.. ఆ టైంలో గజినీ లాగా ఎంత కాలం దండయాత్ర చేస్తావ్, సినిమాలు మానేయ్ అన్న వాళ్లూ ఉన్నారని చెప్పాడు. ఐతే హిందీలో వరుస ఫ్లాపులు వచ్చినా తట్టుకుని నిలబడ్డ అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లను స్ఫూర్తిగా తీసుకుని ప్రయాణం సాగించినట్లు నితిన్ తెలిపాడు.