తెలంగాణ థియేట‌ర్ల‌కు కొత్త షాక్

చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. గ‌త వారాంతంలో విడుద‌లైన సీతారామం, బింబిసార చిత్రాలు వీకెండ్లో చ‌క్క‌టి వ‌సూళ్లు సాధించాయి. ఆ త‌ర్వాత కూడా బాగానే ఆడుతున్నాయి. ఈ వారం ఒక‌టికి మూడు కొత్త చిత్రాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. అవ‌న్నీ కూడా ఆస‌క్తి రేకెత్తిస్తున్న‌వే. దీంతో థియేట‌ర్లలో మ‌రింత‌గా సంద‌డి నెల‌కొంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

రెండు నెల‌ల స్లంప్ త‌ర్వాత ఇలాంటి జోష్ అంద‌రికీ ఉత్సాహాన్నిచ్చేదే. కానీ ఇలాంటి టైంలో ప్ర‌భుత్వం తెలంగాణలోని థియేట‌ర్ల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల మేర మంగ‌ళ‌వారం నుంచి ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు తెలంగాణ‌లోని థియేట‌ర్ల‌లో మార్నింగ్ షోను గాంధీ సినిమాకు కేటాయించాలంటూ ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ షోను ఉచితంగా ప్ర‌ద‌ర్శించాల‌న్న‌ది నిబంధ‌న‌.

మ‌ల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు అని తేడా లేకుండా ఈ 13 రోజ‌ల పాటు గాంధీ సినిమానే ప్ర‌ద‌ర్శించాల‌ట‌. దీంతో మార్నింగ్ షోల‌కు మిన‌హాయించి థియేట‌ర్ల‌లో వేరే షోల‌కు మాత్ర‌మే ఆన్ లైన్ బుకింగ్స్ న‌డుస్తున్నాయి. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో నిర్వ‌హిస్తున్న అమృత మ‌హోత్స‌వాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో దేశ‌భ‌క్తి భావం పెంపొందించేందుకు, మ‌హాత్మా గాంధీ గొప్ప‌ద‌నం గురించి ఈ త‌రం తెలుసుకునేలా చేసేందుకు ఈ షో ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఐతే ఒక‌ట్రెండు రోజులైతే ఓకే కానీ.. 13 రోజుల పాటు ప్ర‌తి థియేట‌ర్లో మార్నింగ్ షోను ఆ చిత్రానికి కేటాయించి ఉచితంగా ప్ర‌ద‌ర్శించాలంటే థియేట‌ర్ల‌కు క‌ష్ట‌మే.

అందులోనూ థియేట‌ర్లలో మంచి సినిమాలు ఆడుతూ, రాబోయే చిత్రాలు కూడా ఆస‌క్తి రేకెత్తిస్తున్న‌పుడు.. ఉన్న సినిమాల‌కే షోలు కేటాయించ‌డం క‌ష్టంగా మారిన‌పుడు ఇలా నిర్బంధంగా ఉచిత షోను కేటాయించ‌డం ఇబ్బందే. మ‌రి ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ఇంతే ప‌ట్టుద‌ల‌గా ఉడి 21వ తేదీ వ‌ర‌కు ఈ షోను కొన‌సాగించాలంటుందా.. లేక మ‌ధ్య‌లో జీవోను విర‌మిస్తుందా అన్న‌ది చూడాలి.