మహేష్ కు అభిమానుల సందేశం

ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చేస్తున్న రచ్చ మాములుగా లేదు. సోషల్ మీడియా మొత్తం పోకిరి మేనియాతో ఊగిపోతోంది. 16 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కోసం ఫాన్స్ ఇంతగా తపించిపోవడం ఏ మాత్రం ఊహించనిది. కొన్నివందల సార్లు చూసేసిన ఈ బ్లాక్ బస్టర్ ని మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేసేందుకు ఎగబడుతున్న తీరు చూసి ట్రేడ్ సైతం షాకవుతోంది.

హైదరాబాద్ లో వేస్తున్న 65 షోలతో కలిపి తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్ మొత్తం రెండు వందలు దాటడం నిజంగానే ఊహకందని రికార్డు. నిన్న ప్రసాద్ ఐమ్యాక్స్ ఒక్కడు ప్రీమియర్లో గుణశేఖర్,భూమికల సాక్షిగా జరిగిన సందడిని మాటల్లో చెప్పలేం. ఇదంతా ఏదో ఒక రోజు సంబరమని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. సూపర్ స్టార్ అభిమానులు తమ హీరోకు డైరెక్ట్ గానే మనసులో మాటను ఈ రూపంలో చెప్పేస్తున్నారు.

శ్రీమంతుడు నుంచి ఒకరకమైన మెసేజ్ హ్యాంగోవర్ లో పడిపోయిన మహేష్ ప్రతి సినిమాలోనూ అది ఉండేలా చూసుకుంటున్నాడు. దర్శకులు కూడా అదే పనిగా అలాంటి కథలు ట్రీట్మెంట్లతోనే హీరోతో క్లాసులు పీకించే ఎపిసోడ్లను రాసుకుంటున్నారు. సర్కారు వారి పాటలో ఇది పీక్స్ కు వెళ్ళిపోయి అసలైన మాస్ అంశాలు సరిగా ప్రొజెక్ట్ కాలేదనే ఫిర్యాదు వచ్చింది.

నిజానికి మహేష్ నుంచి మూవీ లవర్స్ ఆశిస్తున్నవి సమాజాన్ని ఉద్ధరించే సబ్జెక్టులు కాదు. ఒక్కడు, పోకిరి రేంజ్ ఎలివేషన్లు, అదిరిపోయే పాటలు, ధీటైన విలన్లు, రిపీట్లు వేసేలా టెంప్ట్ చేసే మాస్ ఎలిమెంట్స్. ఇప్పుడు పోకిరిని ఈ స్థాయిలో నెత్తిన పెట్టుకుంటున్నారంటే తాము ఏది మిస్ అవుతున్నామో నేరుగా చెబుతున్నట్టే. ఒకవేళ దీని స్థానంలో ఏ మురారినో భరత్ అనే నేనునో వేస్తే ఈ స్థాయి స్పందన ఉండదన్నది వాస్తవం. మరి ఏ మాత్రం ఊహకందని స్థాయిలో పోకిరి ర్యాంపేజ్ ద్వారా తమ మనోగతాన్ని చాటిన ఫ్యాన్స్ మనసులను మహేష్ ఇప్పటికైనా చదివి తనలో దాగిన మాస్ వింటేజ్ సూపర్ స్టార్ ని బయటికి తీస్తాడా. చూద్దాం