మాచర్ల దర్శకుడిని మాట్లాడించారు

ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాల్లో ఒకటి.. మాచర్ల నియోజకవర్గం. పూరి జగన్నాథ్ దగ్గర చాలా సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కొన్ని రోజుల కిందట ఇతను పెద్ద  వివాదంలో చిక్కుకోవడం తెలిసిన విషయమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల అభిమాని అయిన రాజశేఖర్.. గతంలో కమ్మ, కాపు కులస్థులను దూషించినట్లుగా ఉన్న ఒక ట్వీట్ వైరల్ అయింది.

అది ఫేక్ ట్వీట్ అని అతను వాదించినా, దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా.. తన అకౌంట్లోనే ఉన్న వేరే అబ్యూజివ్ ట్వీట్లు కొన్ని వర్గాలకు రుచించలేదు. అతణ్ని కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో గట్టిగా టార్గెట్ చేశారు. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను బ్యాన్ చేయాలంటూ ట్రెండ్ కూడా చేశారు. ఈ నెగెటివిటీ చూసి చిత్ర బృందంలో భయం పట్టుకుంది. దీంతో కొన్ని రోజుల కిందట ‘గుంటూరు’లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రాజశేఖర్‌ను నితిన్ అండ్ కో పక్కన పెట్టింది.

అంతే కాక తన గురించి టీంలో ఎవరూ మాట్లాడనే లేదు. దీంతో రాజశేఖర్ రెడ్డిని చూసి చాలామంది జాలిపడ్డారు. నితిన్ అతడి విషయంలో మరీ కఠినంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దీనికైనా డైరెక్టర్‌ను రానిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ ఈవెంట్‌కు రాజశేఖర్ రెడ్డి హాజరయ్యాడు. అంతే కాక అతడికి వేదిక మీద చోటిచ్చారు. అలాగే మైక్ తీసుకుని మాట్లాడే ఛాన్స్ కూడా దక్కింది. నితిన్ గురించి అతను చాలా పాజిటివ్‌గానే మాట్లాడాడు.

‘‘నేనీ స్థాయికి రావడానికి 15 ఏళ్లు పట్టింది. మాట నిలబెట్టుకోవడం చాలా తక్కువ మంది చేస్తారు. అలాంటి కొద్దిమందిలో నితిన్ ఒకరు. గత వారం విడుదలైన రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ వారం వస్తున్న మా సినిమా కూడా హిట్ కొడుతుంది. కచ్చితంగా ఆగస్టు రుణం తీర్చుకుంటాం’’ అని రాజశేఖర్ అన్నాడు. మరోవైపు నితిన్ కూడా రాజశేఖర్‌కు మంచి ఎలివేషనే ఇచ్చాడు. అతనీ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, సినిమా చూస్తే కొత్త దర్శకుడు తీసినట్లే అనిపించిందని నితిన్ అన్నాడు.