వైజయంతిని నిలబెడుతున్న వారసత్వం

ఒకప్పుడు భారీ బడ్జెట్ గ్రాండియర్లను నిర్మించి గొప్ప ఖ్యాతి సంపాదించిన బడా బ్యానర్లు కాలక్రమేణా వచ్చిన మార్పులకు తట్టుకోలేక తప్పుకోవడం చాలానే చూశాం. సురేష్ ప్రొడక్షన్స్ నే తీసుకుంటే సురేష్ బాబు సోలోగా ప్రొడ్యూసర్ కార్డు వేసుకుని ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. ఎన్టీఆర్ స్థాపించిన రామకృష్ణ సినీ స్టూడియోస్ తన కార్యకలాపాలు ఎప్పుడో ఆపేసింది.

దేవివరప్రసాద్, టి త్రివిక్రమరావు లాంటి అగ్రనిర్మాతలు కాలం చేయడానికి ముందే నిర్మాణాలకు స్వస్తి చెప్పి ఇతర వ్యాపకాల్లో బిజీ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. వీటికి భిన్నంగా వారసురాళ్ల అండతో సి అశ్వినీదత్ వైజయంతి సంస్థకు కొత్త జీవాన్ని ఇస్తూ కొత్త ఉత్సాహంతో పరుగులు పెడుతున్నారు.

కూతురు స్వప్న దత్, ప్రియాంక దత్ లు దీన్ని ముందుండి నడిపిస్తున్న తీరు అద్భుత ఫలితాలను ఇస్తోంది. మొదట్లో కొన్ని ఎదురు దెబ్బలు, ఫ్లాపులు వచ్చినప్పటికీ వీళ్ళు వెనుకడుగు వేయలేదు. అసలు తప్పు ఎక్కడ జరుగుతోందో గుర్తించి దాన్ని సరిచేయడం మొదలుపెట్టారు. మహానటితో ఇది స్టార్ట్ అయ్యింది. సావిత్రి జీవితకథను తెరకెక్కించిన తీరు అందరిని విస్మయపరిచింది.

కమర్షియల్ గానూ అది అందుకున్న విజయం చిన్నది కాదు. ఇక కథగా వినడానికి సిల్లీగా అనిపించే జాతిరత్నాలుతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సీతారామం వంతు. చాలా రిస్క్ అనిపించే ఇలాంటి ప్రాజెక్టుని ఈ స్థాయిలో లావిష్ గా తెరకెక్కించిన తీరు మరోసారి విజయాన్ని వైజయంతి ఖాతాలో వేసింది. స్వప్న, ప్రియాంకలే కాకుండా వీళ్ళ వెనుక ఉండే మరో సోదరి స్రవంతి భాగస్వామ్యం కూడా ఎంతో ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ అశ్వినీ దత్ అల్లుడు నాగఅశ్విన్ పాత్రను విస్మరించలేం. ఇవే ఇంత జాగ్రత్తగా తీస్తే అయిదు వందల కోట్లతో ముడిపడిన ప్రాజెక్ట్ కెని ఇంకే రేంజ్ లో చూపించబోతున్నారో వేరే చెప్పాలా.