అన్నపూర్ణలో ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశం

ప్రస్తుత ఇండస్ట్రీ సమస్యలపై తెలుగు ప్రొడ్యూసర్ గిల్డ్ హాట్ హాట్ గా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుండి షూటింగ్స్ బంద్ పెట్టి మరీ చర్చల్లో పాల్గొంటున్నారు బడా నిర్మాతలు. ఇవ్వాళ అన్నపూర్ణ ఏడెకరాల్లోని బాల్ రూమ్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి గిల్డ్ లో కీలక నిర్మాతలందరూ హాజరయ్యారు. సురేష్ బాబు , అల్లు అరవింద్ , దిల్ రాజు , మైత్రి నవీన్ , నాగ వంశీ , శరత్ మరార్ , అభిషేక్ అగర్వాల్ ఇలా మెయిన్ ప్రొడ్యుసర్స్ అంతా ఎటెండయ్యారు.

ఈ రోజు చర్చల్లో కీలక సమస్యలపై డిస్కస్ చేయనున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా హీరోల రెమ్యునరేషన్ , ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్ ఇలా పలు విషయాలపై మాట్లాడుకోనున్నారట. అలాగే నిన్న జరిగిన షూటింగ్స్ బంద్ గురించి అలాగే దిల్ రాజు , నాగ వంశీ సినిమాల షూటింగ్స్ గురించి కూడా మాట్లాడబోతున్నారు.

నిజానికి తాము నిర్మిస్తున్న ‘వారసుడు’ , ‘సార్’ తమిళ హీరోలతో తీస్తున్న తమిళ్ సినిమాలనేది దిల్ రాజు, నాగ వంశీ వర్షన్. నిన్న ఈ రెండు సినిమాల షూటింగ్స్ జరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఇంకొన్ని షూటింగ్స్ కూడా జరిగాయి. ఇవన్నీ మీడియా గమనిస్తుండటంతో ఇప్పుడు నిర్మాతలు పూర్తి బంద్ గురించి డిస్కషన్ పెట్టనున్నారని సమాచారం.

సాయంత్రం నుండి రాత్రి వరకూ ప్రొడ్యుసర్ గిల్డ్ కీలక సమావేశం జరగనుంది. వీటిలో ముఖ్య విషయాలు చర్చించుకొని మరో మీటింగ్ ఎప్పుడనేది చెప్పుకుంటారు. ఈ లోపు మొదటి కొన్ని సమస్యలపై చర్చించుకొని వాటికి పరిష్కారం తీసుకొచ్చేలా ఓ లాంగ్ డిస్కషన్ జరగనుంది. మరి షూటింగ్స్ బంద్ అంటూ ప్రకటించిన తర్వాత కూడా దిల్ రాజు , నాగ వంశీ లాంటి నిర్మాతలు షూటింగ్స్ చేసుకోవడం మీద అల్లు అరవింద్ , సురేష్ బాబు మిగతా కీలక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.