నైజాంలో అడ్వాన్స్ థాంక్స్ లేదే

రేపు విడుదల కాబోతున్న థాంక్ యు ప్రమోషన్ చివరి దశకు వచ్చేసింది. అక్కినేని అభిమానుల కన్నా చైతు నిర్మాత దిల్ రాజులు ఫలితం మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నాని గ్యాంగ్ లీడర్ చేసిన గాయం దీంతో మానుతుందనే నమ్మకం దర్శకుడు విక్రమ్ కె కుమార్ లో కనిపిస్తోంది. అయితే ఇవాళ రాత్రే కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్లు ప్లాన్ చేయడం అనుకోకుండా వచ్చిన ట్విస్టు. నెల్లూరు, భీమవరం, విజయవాడ, వైజాగ్, రాజమండ్రిలో అఫీషియల్ గా అనౌన్స్ చేయగా రెండు గంటల క్రితం కర్నూలు కూడా జోడించారు.

ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సెంటర్లు. అనూహ్యంగా నైజామ్ కేంద్రం లేకపోవడం మీడియాను సైతం ఆశ్చర్యపరిచింది. ఒకవేళ అలాంటి ప్లానింగ్ ఏదైనా ఉన్నా ఈపాటికే చేసి ఉండాలి. ఆన్ లైన్లో టికెట్ అమ్మకాలు మొదలుపెట్టాలి. కానీ అదేమీ జరగలేదు. ఏరియా పక్కనపెడదాం. కనీసం హైదరాబాద్ లోనూ ఎలాంటి ప్రీమియర్లు వేస్తున్న దాఖలాలు లేవు. ఫస్ట్ షో రేపు ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఉదయం 8.45కు ఎప్పటిలాగే పడనుంది. మరి భాగ్యనగరంలోనూ ముందు రోజు ఎందుకు వేయడం లేదనే ప్రశ్న చైతు ఫ్యాన్స్ లో మెదులుతోంది

కారణమేంటో అంతు చిక్కడం లేదు. యుఎస్ కన్నా ముందే ఏపిలో షోలు పూర్తయిపోతాయి. టాక్ అయితే బయటికి వస్తుంది. వేస్తున్నవి కూడా పెద్ద జిల్లా కేంద్రాలే. ఇదే తరహాలో నైజామ్ లోనూ వేసుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దిల్ రాజు టీమ్ మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ల ఆసక్తి మీద ఈ షోలు ఆధారపడి ఉంటాయంటే అదేదో ప్రాంతాన్ని బట్టి ఉండదుగా. పైగా థాంక్ యు వందల కోట్లతో తీసిన గ్రాండియర్ కాదు. అలాంటప్పుడు ఒక రాష్ట్రానికే ఎందుకు పరిమితం చేసినట్టో .