మైత్రి ఆశలన్నీ పంచరత్నాల మీదే

ఎంత పేరున్న ప్రొడక్షన్ హౌస్ అయినా ఒక్కోసారి వరస ఫ్లాపులు వచ్చినప్పుడు తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. అందులోనూ వరసగా మూడు ఊహించని దెబ్బలు తగిలినప్పుడు కలిగే నష్టం పూడ్చుకోవడానికి కొంత టైం పడుతుంది. భారీ బడ్జెట్ లతో తలలు పండిన సీనియర్ నిర్మాతలకే సాధ్యం కాని రీతిలో పట్టుమని పదేళ్లు దాటకుండానే క్రేజీ కాంబినేషన్లతో ప్రాజెక్టులు సెట్ చేసుకుని దూసుకుపోతున్న మైత్రికి చాలా తక్కువ గ్యాప్ లో హ్యాట్రిక్ ట్విస్టులు తగలడం పరిస్థితి ఎలా ఉందో చూపిస్తోంది.

మహేష్ బాబుతో సర్కారు వారి పాటని అనౌన్స్ చేసినప్పుడు శ్రీమంతుడు రేంజ్ లో హైప్ వచ్చింది. తీరా చూస్తే రెండు వారాలు దాటకుండానే చేతులెత్తేసింది. కంటెంట్ యావరేజ్ గా ఉన్నప్పటికీ సూపర్ స్టార్ ఇమేజ్ నష్టాలను బాగా తగ్గించింది. అయినా కూడా పది కోట్లకు పైనే థియేట్రికల్ లాస్ ఉందని ట్రేడ్ టాక్. ఇక నాని కెరీర్ బెస్ట్ అవుతుందని ఆశించిన అంటే సుందరానికి సైతం తొమ్మిది కోట్ల దాకా చిల్లు పెట్టిందని వినికిడి. ఇక హ్యాపీ బర్త్ డే చేసిందే తక్కువ బిజినెస్. అయినా కూడా 7 కోట్ల మేరకు గండి కొట్టేసింది.

అందుకే రాబోయే పంచరత్నాలతో మైత్రి కంబ్యాక్ అవ్వడం చాలా కీలకం. అందులో మొదటిది బాలయ్య గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న కమర్షియల్ బొమ్మ. రెండోది సుధీర్ బాబు కృతి శెట్టి జంటగా చేస్తున్న ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మూడోది విజయ్ దేవరకొండ సమంతా కలయికలో రూపొందుతున్న ఖుషి. చివరి రెండు ఇంకా ముఖ్యమైనవి. చిరంజీవి రవితేజల వాల్తేర్ వీరయ్యల మీద ఇప్పటికే బజ్ మొదలైపోయింది. ఇక హయ్యెస్ట్ బడ్జెట్ పెడుతున్న పుష్ప 2 ది రూల్ కి కెజిఎఫ్ రేంజ్ రిజల్ట్ ని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి సెట్స్ మీదున్నవి ఇవే కావడంతో వీటిలో ఏ రెండు మూడు బ్లాక్ బస్టర్స్ అయినా చాలు మైత్రికి కంబ్యాక్ జరిగిపోతుంది .