కొంచెం ఆనందం కొంచెం ఆందోళన

నిన్న విడుదలైన మణిరత్నం విజువల్ గ్రాండియర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ట్రైలర్ ఆన్లైన్లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. తమిళ తంబిల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ తాము ఊహించలేదని ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ మల్టీ స్టారర్ కాంబినేషన్ ఓ రేంజ్ లో ఉండటంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. తెలుగులోనూ అదే టైటిల్ ని పెట్టేసి పిఎస్ 1 గా నామకరణం చేసేశారు. సో దాంతోనే సర్దుకోవాలి.

ఇదంతా బాగానే ఉంది కానీ మరోపక్క కొంత ఆందోళన కూడా రేగుతోంది. పొన్నియన్ సెల్వన్ చరిత్రను ఆధారంగా చేసుకుని రాయబడ్డ సుప్రసిద్ధ నవల. దానికి తెరరూపం అంటే పెద్ద సవాల్. ఏ మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా హిస్టరీ ప్రేమికులు విరుచుకుపడతారు. చోళ వంశస్థుల నుంచి అభ్యంతరాలు రావొచ్చు. ఇదంతా ఒక ఎత్తయితే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దీన్నెలా డీల్ చేసుంటారన్న అనుమానం లేకపోలేదు. ఆయన స్థాయి బ్లాక్ బస్టర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో చెప్పడం కష్టం.

వీటికి తోడు బాహుబలిని మించి తమకూ ఒక గొప్ప చిత్రం నిలిచిపోవాలని కలలు కంటున్న కోలీవుడ్ మేకర్స్ కు ఇది ఏ మాత్రం ఆ స్థాయికి తగ్గినా అవమానంగా ఫీలవుతారు. పైగా ఇది మొదటి భాగమే కాబట్టి ఏ మాత్రం ఫలితం కొంచెం అటు ఇటు వచ్చినా దాని ప్రభావం నేరుగా పార్ట్ 2 బిజినెస్ మీద పడుతుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా మేజిక్ చేసి దశాబ్దం పైనే అవుతోంది. హంగామా ఎంత ఉన్నా ఎమోషన్ తో కూడిన ఎలివేషన్లు ఇలాంటి సినిమాల్లో చాలా కీలకం. మరి మణి జక్కన్న స్థాయిలో మాయాజాలం చేయగలడో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 30 దాకా ఆగాల్సిందే.