ఫ్లాప్ కాంబినేషన్ రిపీట్

ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోలు టాలీవుడ్లో కొందరున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కూడా అదే తరహా. ‘మళ్ళీ రావా’ మినహాయిస్తే గత దశాబ్ద కాలంలో అతడికి ఓ మోస్తరు హిట్ కూడా లేదు. ఈ సినిమాకు ముందు, తర్వాత అన్నీ డిజాస్టర్లే. అయినా సరే.. అతను సినిమాలేమీ ఆపేయట్లేదు. గత ఏడాది ‘కపటధారి’తో ఎదురు దెబ్బ తిన్న అతను.. కొన్ని నెలల కిందట ఓటీటీ మూవీ ‘మళ్ళీ మొదలైంది’తోనూ ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయాడు.

ప్రస్తుతం అతడి చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి.. ‘అనగనగా ఒక రౌడీ’ కాగా, మరొకటి ‘అహం: రీబూట్’. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈలోపు సుమంత్ ఇంకో కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. తనతో ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం తీసిన సంతోష్ జాగర్లమూడితో అతను మళ్లీ జట్టు కట్టబోతున్నాడు.

ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాగా మెప్పించలేకపోయింది. సాధారణమైన కథాకథనాలు.. పూర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆ సినిమాకు ప్రతికూలంగా మారి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. సంతోష్ జాగర్లమూడికి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఆ సినిమా చూస్తే కొంత విషయం ఉన్న వాడిలాగే కనిపించాడు. అందుకే ఏషియన్ మూవీస్ లాంటి పెద్ద సంస్థ అతడికి దర్శకుడిగా రెండో అవకాశం ఇచ్చింది. నాగశౌర్య హీరోగా ఈ బేనర్లో అతను ‘లక్ష్య’ సినిమా తీయడం తెలిసిందే. ఈ చిత్రం కూడా ఫ్లాపే అయింది. అయినా వెరవకుండా కొత్త సినిమాకు స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. తన తొలి చిత్ర కథానాయకుడు సుమంత్‌తో తన మూడో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

కేఆర్ క్రియేషన్స్ బేనర్ మీద ప్రదీప్ కేఆర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరి సుమంత్, సంతోష్ కలిసి ఈ సారైనా తొలి చిత్రానికి భిన్నంగా హిట్ సినిమాను డెలివర్ చేస్తారేమో చూడాలి. సుమంత్ ప్రస్తుతం ‘సీతారామం’లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.