స్టార్ హీరో.. మళ్లీ దర్శకత్వం

బాలీవుడ్లో మాస్, యాక్షన్ సినిమాలకు పేరుబడ్డ అజయ్ దేవగణ్‌లో ఒక దర్శకుడు ఉన్నాడని చాలామందికి తెలియదు. నటుడిగా 20 ఏళ్లకు పైగా పైగా అనుభవం వచ్చాక ఆయన 2006లో ‘యు మి ఔర్ హమ్’ సినిమా కోసం మెగా ఫోన్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందులో అజయ్ భార్య కాజోలే కథానాయిక. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మళ్లీ ఇంకో పదేళ్ల తర్వాత ‘శివాయ్’ సినిమా కోసం అజయ్ దర్శకుడిగా మారాడు. ఆ చిత్రంలో యాక్షన్ ఘట్టాలను అక్షయ్ తీర్చిదిద్దిన వైనం, తన ఓవరాల్ టేకింగ్ ఆకట్టుకున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు.

ఇక ఇటీవలే ‘రన్ వే 34’ మరోసారి డైరెక్టర్ అవతారం ఎత్తాడు అజయ్. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులు లేక సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. కానీ ఓటీటీలో ఈ సినిమాకు చాలా మంచి స్పందన వచ్చింది. దర్శకుడిగా అజయ్ చాలా పరిణతి చెందాడని, అతడిలో మంచి ఫిలిం మేకర్ ఉన్నాడని ఈ సినిమా చాటిచెప్పింది.

‘రన్ వే 34’ దర్శకుడిగా అజయ్‌లో ఆత్మవిశ్వాసం పెంచడంతో ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మళ్లీ మెగా ఫోన్ పట్టేశాడు అజయ్. తన దర్శకత్వంలో ‘భోలా’ పేరుతో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఐతే ఇదేమీ అజయ్ సొంత కథతో తెరకెక్కుతున్న స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్టయిన ‘ఖైదీ’నే ఈ పేరుతో రీమేక్ చేస్తున్నాడు అజయ్. ‘ఖైదీ’ రీమేక్‌లో అజయ్ హీరో అన్నది పాత విషయమే. ముందు ఈ చిత్రం కోసం వేరే దర్శకుడిని ఎంచుకోవాలని అనుకున్నారు. కానీ తర్వాత ఆలోచన మారింది. అజయే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.

డైరెక్షన్ మీద పట్టు సంపాదించడం, పైగా ‘ఖైదీ’ లాంటి మంచి విషయం ఉన్న సినిమాను రీమేక్ చేయనుండడంతో అజయ్ కాన్ఫిడెంట్‌గా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ సరసన టబు నటిస్తోంది. నిజానికి ‘ఖైదీ’లో కథానాయిక పాత్రే కనిపించదు. కానీ హిందీలో అజయ్‌కి జోడీగా టబును తీసుకోవడాన్ని బట్టి స్క్రిప్టులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.