మైసూర్లో నరేష్-పవిత్ర.. రమ్య రభస

కన్నడ నటి పవిత్ర లోకేష్‌తో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ బంధం గురించి కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే. వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారన్న చర్చ నడిచింది. కానీ ఇంతలో నరేష్ మూడో భార్య రమ్య సీన్లోకి వచ్చింది.

తనకు నరేష్ విడాకులు ఇవ్వకుండానే పవిత్రతో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆమె మీడియాలో పెద్ద గొడవే చేసింది. ఆమె పవిత్ర స్వస్థలమైన బెంగళూరుకు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం.. ప్రతిగా నరేష్ కూడా మీడియాతో మాట్లాడుతూ రమ్య మీద తీవ్ర ఆరోపణలు చేయడం.. పవిత్ర సైతం మీడియాకు బైట్ ఇవ్వడం తెలిసిందే. కానీ రచ్చ అంతటితో ఆగలేదు. రెండు మూడు రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఓ సినిమా చిత్రీకరణ కోసమని మైసూరులోని ఓ హోటల్లో నరేష్, పవిత్ర బస చేస్తున్న హోటల్‌కు వెళ్లి రమ్య పెద్ద గొడవే చేసినట్లు తెలుస్తోంది.

ఈ గొడవకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది ఇప్పుడు. నరేష్, పవిత్ర హోటల్ గది నుంచి బయటికి వస్తుండగా.. రమ్య చెప్పు తీసుకుని వారిని కొట్టేందుకు ప్రయత్నించడం.. పోలీసులు అడ్డుకుని ఆమెను పక్కకు లాగేయడం, వెనుక కొందరు నినాదాలు చేయడం, నరేష్ వాళ్లను చూసి విజిల్స్ వేస్తూ లిఫ్టులోకి వెళ్లడం, ఆయన్ని పవిత్ర అనుసరించడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

నరేష్-పవిత్ర అక్కడ బస చేస్తున్నట్లు రమ్యకు ఎలా తెలిసిందన్నది అర్థం కాని విషయం. ఆమె తన అనుచరులతో కలిసి పెద్ద గొడవ చేయగా.. నరేష్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది.

నరేష్, రమ్య గత కొన్ని రోజుల్లో ఒకరి గురించి ఒకరు తీవ్ర ఆరోపణలే చేసుకున్నారు. పవిత్రను పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా తన నుంచి విడాకుల కోసం నరేష్ గన్నుతో బెదిరించారని రమ్య ఆరోపిస్తే.. రమ్య తనతో ఎప్పుడూ సక్రమంగా కాపురం చేసింది లేదని, ఆమె ఒక డ్రైవర్‌తో సంబంధం పెట్టుకుందని నరేష్ ఎదురు దాడి చేశారు.