‘ఆచార్య’కు పరుచూరి పోస్టుమార్టం

మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్.. కొరటాల శివ… ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందని అనుకుంటే.. తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా పరాజయానికి అనేక కారణాలున్నాయి. వాటిని అనేక మంది అనేక రకాలుగా విశ్లేషించారు. ఇప్పుడు లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.. తన యూట్యూబ్ ఛానెల్లో ‘పరుచూరి పాఠాలు’లో ‘ఆచార్య’ గురించి మాట్లాడారు.

ఈ సినిమా పరాజయానికి ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. అసలు ఈ చిత్రానికి ‘ఆచార్య’ టైటిల్ పెట్టడమే కరెక్ట్ కాదని పరుచూరి అభిప్రాయపడ్డారు. నక్సలైట్ సినిమాలు ఒకప్పుడు చాలా బాగా ఆడేవని, తర్వాత అవి తగ్గిపోయాయని.. ఇలాంటి సమయంలో ఎర్ర సినిమా తీయాలని, మంచి పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పాలని కొరటాల భావించి ఉండొచ్చని.. కానీ కమ్యూనిజం బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు ఇప్పుడు ప్రేక్షకలుకు నచ్చట్లేదని పరుచూరి అన్నారు.

సినిమాగా చూస్తే ‘ఆచార్య’లో తప్పేమీ లేదని.. కానీ కథలో ముఖ్యమైన సంఘటన ఎందుకు జరిగింది.. ఏం జరిగింది అనేది చెప్పకుండా కథను నడిపించిన తీరు ప్రేక్షకులను అయోమయంలో పడేసిందని పరుచూరి చెప్పారు. సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే చోట ఇమడవని.. రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్ర.. ఫస్టాఫ్‌లోనే రావాల్సిందని.. ఆ పాత్రను మొత్తంగా కాకపోయినా కొంచెమైనా అక్కడ చూపించి ఉండాల్సిందని ఆయనన్నారు.

అసలు చరణ్ చేత సిద్ధ పాత్ర చేయించాల్సింది కాదని.. ఒకవేళ తప్పదనుకుంటే ఫ్లాష్ బ్యాక్‌లో 10 శాతం ఆ పాత్ర ఉండి.. 90 శాతం చిరు క్యారెక్టర్ ఉండాల్సిందని.. కమ్యూనిస్టు భావజాలం ఉన్న చిరంజీవి ఇందులో ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఆచార్య’కు సంగీతం కూడా సరిగా కుదరలేదని.. ఇంకా కొన్ని లోపాటు చోటు చేసుకున్నాయని పరుచూరి అన్నారు. తనకు ఈ సినిమా చూస్తుండగా.. ‘మరో మలుపు’ మూవీ గుర్తుకొచ్చినట్లు పరుచూరి చప్పారు.