షారుఖ్ అభిమానులకు గూస్ బంప్సే

ప్రేక్షకుల విషయంలో ఏదీ గ్రాంటెడ్‌గా తీసుకోకూడదని చెప్పడానికి ఎన్నో రుజువులున్నాయి. బాలీవుడ్లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన షారుఖ్ ఖాన్.. ఒక దశలో ఇదే ఆలోచనతో గాడి తప్పాడు. తాను ఏ సినిమా చేసినా జనం చూసేస్తున్నారని, ఓపెనింగ్స్ వచ్చేస్తున్నాయని మరీ పేలవమైన సినిమాలు చేశాడు. కానీ ఒక దశ దాటాక ఇదే చేటు చేసింది. షారుఖ్ మీద ప్రేక్షకులు నమ్మకం కోల్పోయారు. దీంతో వరుసగా పరాజయాలు అతణ్ని పలకరించాయి.

‘జీరో’ సినిమాతో అతడి మార్కెట్ దాదాపు జీరో అయిపోయింది. అప్పుడు కానీ సారు తేరుకోలేదు. బాగా గ్యాప్ తీసుకుని, తాను చేసిన, చేయాల్సిన సినిమాల విషయంలో ఆత్మపరిశీలన చేసుకుని.. చివరికి కాస్త ముందు వెనుకగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి.. పఠాన్. బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాల దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న చిత్రమిది.

గతంలో ప్రతి సినిమాకు అనవసర హైప్ తెచ్చే ప్రయత్నంలో కూడా షారుఖ్ ఎదురు దెబ్బలు తిన్నాడు. అందుకే ‘పఠాన్’ విషయంలో ఆ హడావుడే లేదు. సినిమా ఎప్పుడు మొదలైందో.. షూటింగ్ ఎంత వరకు వచ్చిందో.. ఇలా ఏ వివరాలూ బయటపెట్టలేదు. చడీచప్పుడు లేకుండా షూటింగ్ చివరి దశకు తీసుకొచ్చాడు. ఇప్పటిదాకా ఫస్ట్ లుక్కే రిలీజ్ చేయని టీం.. ఎట్టకేలకు అభిమానులకు ‘పఠాన్’ను పరిచయం చేసింది.

షారుఖ్ సినీ ప్రస్థానం 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘పఠాన్’ నుంచి ఒక ఫెరోషియస్ లుక్ రిలీజ్ చేసింది. షారుఖ్‌ను సైడ్ లుక్‌లో చూపించిన ఈ పోస్టర్లో.. భారీ గన్ను పట్టుకుని రక్తమోడుతూ కనిపించాడు షారుఖ్. ఇది సిద్దార్థ్ స్టయిల్లో సాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఈ పోస్టర్‌ను బట్టే అర్థమైపోయింది. షారుఖ్ నుంచి అభిమానులు కోరుకుంటున్న సినిమా కూడా అలాంటిదే. ఫస్ట్ లుక్‌తో అభిమానులను వెర్రెత్తించిన సిద్దార్థ్.. సినిమాతో వాళ్లకు గూస్ బంప్స్ ఇవ్వడం గ్యారెంటీ అని తేలిపోయింది. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 25న సినిమాను రిలీజ్ చేయబోతున్న విషయాన్ని కూడా వెల్లడించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.