మెగా కుర్రాడు.. ఏందయ్యో ఈ కాన్ఫిడెన్స్

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు పంజా వైష్ణవ్ తేజ్. ఒక కొత్త హీరోకు ఇంతకంటే మించిన అరంగేట్రం దక్కదు. రెండో సినిమాకే క్రిష్ లాంటి టాప్ డైరెక్టర్‌తో సినిమా చేశాడతను. కానీ వీరి కలయికలో వచ్చిన ‘కొండపొలం’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది.
త్వరలోనే అతను ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ లోపు వైష్ణవ్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ‘భీమ్లా నాయక్’ను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. త్రివిక్రమ్ సంస్థ ‘ఫార్చ్యూన్ 4’ కూడా ఇందులో భాగస్వామిగా ఉండడం విశేషం.

శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు ఈ రోజు. వైష్ణవ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఊర మాస్‌గా ఉండబోతోందని, వయొలెన్స్-యాక్షన్ ఒక రేంజిలో ఉంటుందని ఇందులో వినిపించిన డైలాగులను బట్టి అర్థమవుతోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో నాటుగా ఉండే సినిమా అనే సంకేతాలను ఈ గ్లింప్స్ ఇచ్చింది. ‘‘తలలు కోసి సేతికిస్తా నా యాలా.. సూస్కుందాం రా’’ అంటూ వైష్ణవ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. కేవలం డైలాగులతోనే సినిమా మీద అంచనాలను పెంచడంలో చిత్ర బృందం విజయవంతం అయింది.

ఇక ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది రిలీజ్ డేటే. సినిమా ఆరంభ దశలోనే విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చేసింది చిత్ర బృందం. 2023 సంక్రాంతికి ఈ చిత్రం రిలీజవుతుందని ప్రకటించారు. మామూలుగా సంక్రాంతి పండుగ అంటే భారీ చిత్రాలే రేసులో నిలుస్తుంటాయి. వచ్చే సంక్రాంతికి ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’తో పాటు రామ్ చరణ్-శంకర్‌ల చిత్రం కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇంత భారీ సినిమాలు ఉండగా వాటికి పోటీగా వైష్ణవ్ చిత్రాన్ని పోటీలో నిలపాలనుకోవడం సాహసమే. అందులోనూ ఇది పండక్కి సరిపోయే ఫ్యామిలీ మూవీ కూడా కాదు. ఓ కొత్త దర్శకుడు రూపొందించిన మాస్ మూవీని భారీ చిత్రాల మీదికి పోటీకి దింపడంలో చిత్ర బృందం కాన్ఫిడెన్స్ ఏంటో?