మానాడుని మర్చిపోయారా బాస్

8 నెలల క్రితం తమిళంలో విడుదలైన మానాడు ఎంత పెద్ద హిట్టో కోలీవుడ్ అప్డేట్ ని ఫాలో అయ్యేవాళ్ళకు తెలుసు. సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న శింబుకి పర్ఫెక్ట్ కంబ్యాక్ గా నిలిచింది. దీన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందివ్వాలనే ఉద్దేశంతో అదే డేట్ (నవంబర్ 25) కి డబ్బింగ్ వెర్షన్ ని సిద్ధం చేశారు. రెండు మూడు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం పెట్టారు. ఇంతలో లోలోపల ఏమైయ్యిందో కానీ సరిగ్గా సమయానికి ఏపి తెలంగాణలో బొమ్మ పడలేదు. హైదరాబాద్ లో కేవలం తమిళ ప్రింట్ రిలీజయ్యింది.

కట్ చేస్తే కొద్దిరోజుల తర్వాత రీమేక్ అనౌన్స్ మెంట్ వచ్చింది. హక్కులు తాము కొన్నామని, ఎవరు కాపీ చేసినా సన్నివేశాలను వాడుకున్నా చర్యలు తీసుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది. సరే ఎవరితో తీస్తారనే విషయంలో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. నాగ చైతన్య, రానా, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ ఇలా ఏవేవో ఆప్షన్లు తెరపైకి తీసుకొచ్చారు. కానీ అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. ఏదీ కార్యరూపం దాల్చలేదు. కాలం కర్పూరంలా కరిగిపోతున్నా ఎలాంటి న్యూస్ లేదు.

ఈలోగా మానాడు దర్శకుడు వెంకట్ ప్రభు నాగచైతన్యతో ఓ ప్రాజెక్టు సెట్ చేసుకున్నారు. అడిగితే రీమేక్ కాదు ఫ్రెష్ సబ్జెక్టన్నారు. అంటే మానాడుని పూర్తిగా అటకెక్కించారా లేక ఫ్యూచర్ లో తీస్తారా అనేది తెలియలేదు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ముస్లిం. తీవ్రవాదానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. టైం లూప్ కాన్సెప్ట్ కాబట్టి సన్నివేశాలు పదే పదే రిపీట్ అవుతాయి. ఇంత టిపికల్ పాయింట్ తో మన ఆడియన్స్ ని కన్వీన్స్ చేయలేమని తప్పుకున్నారో లేక ఎవరూ దొరక్క ఆలస్యం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు.