పవన్ కళ్యాణ్ టార్గెట్ అక్టోబర్ 5

అసలు టార్గెట్ ఏంటి, ఆలోగా చేయాల్సిన పనులేంటి అనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఎండగడుతూ, తమ పార్టీ విధి విధానాలు వివరిస్తూ తిరుపతి నుంచి రాజకీయ యాత్ర మొదలుపెట్టబోతున్నారు. ఆ టైంకు ఎండలు పూర్తిగా తగ్గిపోయి వాతావరణం చల్లబడి ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడిదాకా ఎన్నిరోజులు ఉంటుందనేది త్వరలోనే ప్రకటిస్తారు. సుదీర్ఘంగా ఉంటుందన్నది మాత్రం వాస్తవం.

ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాల్లో అర్జెంటుగా పూర్తి చేయాల్సింది హరిహర వీరమల్లు. దీనికోసమే జుత్తుని కత్తిరించకుండా అలాగే మైంటైన్ చేస్తున్నారు. ఆగిందని, తనకు దర్శకుడు క్రిష్ కు ఏవో విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది కానీ అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. ఇప్పుడు చేతిలో మూడున్నర నెలల టైం ఉంది. గతంలో వినోదయ సితం రీమేక్ ని యాభై రోజుల్లో ప్లాన్ చేసుకున్నారు. ఈ గ్యాప్ లో చకచకా ఫినిష్ చేయడం పెద్ద సమస్య కాదు. భారీ బడ్జెట్ మూవీ కాదు కాబట్టి ఈజీగా హైదరాబాద్ లోనే మేనేజ్ చేయొచ్చు.

ఇప్పుడు అసలు చిక్కు భవదీయుడు భగత్ సింగ్ కే. దర్శకుడు హరీష్ శంకర్ కి మరికొన్ని ఎదురు చూపులు తప్పేలా లేదు, కాకపోతే ఆ యాత్ర ఎన్ని రోజులు ఉంటుందనే దాని మీద ఈ సమీకరణాలన్నీ ఆధారపడి ఉంటాయి. ఎలా చూసుకున్నా ఇంకొద్ది నెలలు వెయిట్ చేయాల్సి రావొచ్చు. లేదూ కొంత భాగాన్ని యాత్ర స్టార్ట్ అయ్యేలోగా చేసేయొచ్చు. అసలు పవన్ ప్లానింగ్ ఎలా ఉంటుందనేది అంతు చిక్కడం లేదు. ఆయనా బయటపడటం లేదు. సంక్రాంతికైనా వీరమల్లుని తీసుకొస్తారా లేదా అనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది.