కమలే ఒప్పుకున్నాడు.. తెలుగు సినిమాకు తిరుగులేదని

ఒక 20 ఏళ్లు వెనక్కి వెళ్తే.. తమిళ సినిమాల ముందు తెలుగు చిత్రాలు అస్సలు నిలిచేవి కావు. ఇక్కడ మన వాళ్లు రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీస్తుంటే.. తమిళంలో గొప్ప గొప్ప ప్రయోగాలు జరిగేవి. కమర్షియల్ సినిమాల్లో కూడా కొత్తదనం ఉండేది. ఆ సినిమాలకు రీచ్ బాగా ఉండేది.

తెలుగులోకి అనువాదం అయి ఇక్కడ ఇరగాడేసేవి. అదే సమయంలో తెలుగు సినిమాలను తమిళనాట రిలీజ్ చేసే పరిస్థితే ఉండేది కాదు. కమర్షియల్‌గా తమిళ చిత్రాలు పెద్ద సక్సెస్ కావడమే కాదు.. జాతీయ అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డుల్లోనూ ఆధిపత్యాన్ని చాటేవి. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి.

ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. మన చిత్రాల మార్కెట్ పరిధిగా బాగా విస్తరించింది. ఇటీవల పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా బలం ఇంకా పెరిగింది. అదే సమయంలో తమిళ చిత్రాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. వాటి క్వాలిటీ, మార్కెట్ పరిధి కుచించుకుపోతోంది.

ఈ పరిణామ క్రమాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ బాగానే అర్థం చేసుకున్నట్లున్నారు. తెలుగులో రిలీజవుతున్న తన కొత్త చిత్రం ‘విక్రమ్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. పాన్ ఇండియా ట్రెండ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతీయ సినిమా హబ్‌గా హైదరాబాద్ నిలిచే లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఇంతకుముందు చెన్నై ఆ స్థాయిలో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ఆ దిశగా ఎదుగుతోంది’’ అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ఇక ఒకప్పటి తెలుగు సినిమాల వైభవం గురించి కమల్ మాట్లాడుతూ.. ‘‘పాత చరిత్ర చూస్తే ఏఎన్నార్ ‘దేవదాస్’ తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్లు ఆడింది. ‘మరో చరిత్ర’ తెలుగు చిత్రంగానే అక్కడ రెండున్నరేళ్లు ఆడింది. ‘శంకరాభరణం’ కూడా అలాగే చరిత్ర సృష్టించింది. ‘సాగరసంగమం’ డబ్ అయి సిల్వర్ జూబ్లీ ఆడింది. పాన్ ఇండియా ట్రెండ్‌ను బాలచందర్ ఎప్పుడో పరిచయం చేశారు. ఆయనకంటే ముందు ఏఎన్నార్ ఉన్నారు. నాగిరెడ్డి గారు తెలుగుతో పాటు తమిళంలోనూ పెద్ద పెద్ద సినిమాలు తీశారు’’ అని కమల్ పేర్కొన్నాడు.