కొంపకు నిప్పంటించుకున్న కంగనా

కంగనా రనౌత్.. బాలీవుడ్ చరిత్రలోనే అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా.. ఇంకెవరికీ సాధ్యం కాని స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కథానాయిక. కేవలం ఆమె పేరు చూసి లక్షల మంది థియేటర్లకు వెళ్లిపోయే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ లాంటి సినిమాలతో ఆమెకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే ఆమె మీద వంద కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది.

‘మణికర్ణిక’ మీద నాలుగేళ్ల కింటే ఆ మేర ఖర్చు పెట్టారు. కంగనాకు నిర్మాతలు ఏ స్థాయిలో ప్రయారిటీ ఇచ్చారంటే.. ఆమెకు ఔట్ పుట్ నచ్చక రీషూట్లు చేయాలంటే ఆ చిత్ర దర్శకుడు క్రిష్‌ను పక్కన పెట్టి మరీ ఆమెకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఐతే ఆ సినిమా వరకు ఆమె హవా బాగానే నడిచింది. క్రిష్‌తో కంగనా వ్యవహరించిన తీరు చాలామందికి అభ్యంతరకరంగా అనిపించినా.. అప్పుడు ఆమె ఉన్న ఫామ్, తన నోటి దురుసు చూసి అందరూ సైలెంట్ అయిపోయారు.

ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండే సినీ రంగంలో తమ గురించి తాము మరీ ఎక్కువ ఊహించుకుని హద్దులు దాటి ప్రవర్తిస్తే.. కింద పడటానికి ఎంతో సమయం పట్టదు. కంగనా పరిస్థితి సరిగ్గా ఇదే అయింది. తనకొక ఇమేజ్ వచ్చింది కదా అని.. అదే పనిగా బాలీవుడ్ సినీ ప్రముఖులను టార్గెట్ చేయడం మొదలుపెట్టిందామె. హీరోయిన్‌గా నిలదొక్కుకునే క్రమంలో ఆమె కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు. వివక్ష కూడా ఎదుర్కొని ఉండొచ్చు. ఇప్పుడు తాను ఒక స్థాయి అందుకునేసరికి అందరినీ తీవ్రంగా విమర్శించడం, కించపరిచేలా మాట్లాడటం బాగా ఎక్కువైపోయింది.

ఒక ఇమేజ్ వచ్చాక ఆమె ఎంత తలబిరుసుగా మాట్లాడిందో అందరికీ తెలిసిందే. తనతో సమాన స్థాయిలో, ఇంకా పెద్ద రేంజిలో ఉన్న వారి గురించి ఎలా టార్గెట్ చేసిందో అందరూ చూశారు. అలాంటపుడు కంగనా ఎదిగే రోజుల్లో ఆమె కంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారు తనను తక్కువగా చూసి ఉండడంలో ఆశ్చర్యమేముంది? ఈ లాజిక్ అర్థం చేసుకోకుండా కరణ్ జోహార్ సహా అందరినీ ఆమె టార్గెట్ చేసింది. ఇది చాలదన్నట్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుగా రంగంలోకి దిగి ఆమె చేసిన అతి అంతా ఇంతా కాదు. ఇది జనాలకు ఒళ్లు మండేలా చేసింది. సినిమాకు అవతల ఆమె ప్రవర్తను శ్రుతి మించి పోవడంతో జనాలు సమయం కోసం ఎదురు చూశారు. ఆల్రెడీ పరాజయాల్లో ఉన్న కంగనాకు.. కొత్త చిత్రం ‘ధాకడ్’ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు.

కంగనాను నమ్మి వంద కోట్ల దాకా బడ్జెట్ పెడితే.. ఒక్క రూపాయి కూడా వెనక్కి రాని పరిస్థితి తలెత్తింది ఈ చిత్రానికి. ఈ సినిమా కలెక్ట్ చేసి మూణ్నాలుగు కోట్లు థియేటర్ల మెయింటైనెన్స్‌కు సరిపోయి ఉంటాయి. రిలీజ్ ముంగిట ఎవ్వరూ ఆడియో హక్కుల కొనకపోవడంతో నిర్మాత సొంతంగా ఆడియో కంపెనీ పెట్టి పాటలు రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇక పోస్ట్ రిలీజ్ డిజిటల్, శాటిలైట్ హక్కుల అమ్మకానికి ప్రయత్నిస్తుంటే.. ఏ ఓటీటీ, టీవీ ఛానెల్ కూడా ముందుకు రావట్లేదని వార్తలొస్తున్నాయి. ఇదంతా కంగనా కోరి తెచ్చుకున్న నెగెటివిటీ ఫలితమే. ఒక రకంగా ఆమె తన కొంపకు తానే నిప్పెట్టుకుందనే చెప్పాలి.