‘ప్రాజెక్ట్ కె’పై దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు


‘బాహుబలి’ తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు ప్రభాస్. ‘బాహుబలి’తో వచ్చిన ఆకాశమంత ఇమేజ్‌ను ఈ రెండు చిత్రాలూ మ్యాచ్ చేయలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనక ఫలితం వచ్చింది. ‘సాహో’ అయినా యాక్షన్ ప్రియుల్ని అలరించింది కానీ.. ‘రాధేశ్యామ్’ మాత్రం అన్ని రకాలుగా నిరాశనే మిగిల్చింది.

ఐతే ఈ రెండు చిత్రాల తర్వాత ప్రభాస్ ఓకే చేసిన ప్రాజెక్టులు మాత్రం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ప్రభాస్ రేంజికి తగ్గట్లే భారీ బడ్జెట్లలో, పెద్ద కాన్వాస్‌లో తెరకెక్కుతున్నవే. ఆల్రెడీ ‘ఆదిపురుష్’ లాంటి మెగా మూవీని పూర్తి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సమాంతరంగా సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటిలో అన్నిటికంటే ముందు ప్రకటించిన ‘ప్రాజెక్ట్ కె’ చివరగా విడుదల కాబోతోంది. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ కలగలిసిన కథతో ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఐతే ప్రభాస్ చేస్తున్న మిగతా చిత్రాలతో పోలిస్తే ‘ప్రాజెక్ట్ కె’ గురించి మీడియాలో పెద్దగా వార్తలు రావట్లేదు. అధికారిక అప్‌డేట్స్ ఇచ్చి చాలా కాలం అయిపోయింది. దీంతో సోషల్ మీడియా జనాలు చిత్ర బృందంపై కొంత ఆగ్రహంతో ఉన్నారు.

ఐతే దర్శకుడు నాగ్ అశ్విన్ అలాంటి వారిని కూల్ చేసే ప్రయత్నం చేశాడు ట్విట్టర్ ద్వారా. ఓ ప్రభాస్ అభిమాని మేం గుర్తున్నామా అంటూ పరోక్షంగా ‘ప్రాజెక్ట్ కె’ గురించి ప్రస్తావించగా.. సినిమా గురించి తాను చెప్పాల్సింది చెప్పాడు నాగ్ అశ్విన్. “ఇప్పుడే ఒక షెడ్యూల్ అయింది. ప్రభాస్ గారి ఇంట్రో బిట్ కూడా పూర్తి చేశాం. ఆయన చాలా కూల్‌గా ఉన్నారు. జూన్ నుంచి మళ్లీ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. రిలీజ్ ఆర్డర్లో మనం చివర కదా. తరచుగా అప్‌డేట్స్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది. కానీ మిగతా విషయాలన్నీ ఓకే. అందరూ ప్రాణం పెట్టి పని చేస్తున్నాం” అంటూ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఊరడించే ప్రయత్నం చేశాడు నాగ్ అశ్విన్. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో రూపొందిస్తోంది.