మ‌ళ్లీ ట్రోల్స్ బారిన ప‌డ్డ థ‌మ‌న్

Thaman


ఇప్పుడు తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభం నుంచి కూడా తెలుగులో అతను టాప్ సంగీత దర్శకుల్లో ఒకడిగా ఉంటున్నాడు. ఐతే ఎప్పటికప్పుడు భారీ సినిమాలు చేస్తున్నా సరే.. టాలీవుడ్లో తమన్ ఎదుర్కొన్నంత విమర్శలు, ట్రోలింగ్ ఎవరికీ ఎదురు కాలేదంటే అతిశయోక్తి కాదు. అందుక్కారణం అతను ఒక టైంలో ఒకే రకమైన ఊకదంపుడు పాటలు చేయడం, కొన్ని ఇంటర్నేషనల్ పాటల్ని కాపీ కొట్టడం, అలాగే తన ట్యూన్స్‌నే రిపీట్ చేయడం.

గత మూణ్నాలుగేళ్ల నుంచి మంచి ఫాంలో ఉంటూ వరుసగా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లు ఇస్తున్నా సరే.. అప్పుడప్పుడూ అతడి పాటలు ట్రోలర్స్‌కు టార్గెట్ అయిపోతున్నాయి. అందుక్కారణం తన ట్యూన్లను తనే అనుకరించడమే. ఇప్పుడు మరోసారి తమన్ అదే పని చేయడంతో సోషల్ మీడియా జనాలు అతణ్ని ఆటాడేసుకుంటున్నారు.

మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి తాజాగా ‘మ మ మహేషా’ అనే మాస్ సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. మొన్న పల్లవి రిలీజైనపుడే జనాలకు ట్యూన్ ఎక్కడో విన్నట్లుగా అనిపించింది. తమనే సంగీతం అందించిన ‘ఛల్ మోహన రంగా’ చిత్రంలో ఫస్ట్ లుక్కు సోమవారం అంటూ సాగే పాటకు చాలా దగ్గరగా అనిపించింది ఈ పాట పల్లవి కాకపోతే. నితిన్ సినిమాలోని పాట కొంచెం నెమ్మదిగా, క్లాస్‌గా సాగితే.. మహేష్ సాంగ్ వేగంగా, మాస్‌గా నడిచింది.

ఇక తాజాగా ‘మ మ మహేషా’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయగా.. చరణం వింటుంటే తన పాటే ఒకటి యాజిటీజ్ దించేసినట్లున్నాడు తమన్. ‘సరైనోడు’ సినిమాలో ‘బ్లాక్‌బస్టర్’ పాట విని, దీన్ని వింటే ఏమీ తేడా అనిపించట్లేదు. దీని మీద అప్పుడే వీడియోలు రెడీ అయిపోయాయి. రెండు పాటలను పోలుస్తూ.. తమన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరీ ఇంత సిమిలర్ ట్యూన్స్ ఎలా చేస్తాడు.. అంత పాపులర్ పాట ట్యూన్‌ను ఎలా రిపీట్ చేస్తాడు అంటూ అతణ్ని విమర్శిస్తున్నారు సంగీత ప్రియులు.